పాలకుర్తిలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ
•రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభం.
పాలకుర్తి (లోకల్ గైడ్):
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పాలకుర్తిలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని అత్యంత ఘనంగా ఆవిష్కరించారు. రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, రాష్ట్రంలో రెండవ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో పాలకుర్తి శాసనసభ్యురాలు యశస్విని రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి పాల్గొని వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.ముందు రాష్ట్రంలో మొదటి నూతన తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెలంగాణ సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. దాని అనంతరం రెండవ విగ్రహాన్ని పాలకుర్తిలో ఆవిష్కరించడం విశేషంగా నిలిచింది. ఈ విగ్రహం ప్రత్యేకత ఏమిటంటే ఇది తెలంగాణ ఆడబిడ్డను ప్రతిబింబించేలా, ఒక సామాన్య మహిళ రూపంలో రూపొందించబడింది. ఆకుపచ్చ చీరలో, రాష్ట్రాన్ని ప్రతినిధించే పచ్చని పంటలతో అనుబంధంగా, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిఫలించేలా ఈ విగ్రహాన్ని తయారుచేశారు. ఇది ప్రతి తెలంగాణ వాసిలో గర్వభావాన్ని కలిగించేదిగా ఉంటుంది.ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం సాంస్కృతికంగా, రాజకీయంగా ఎంతో గొప్పదైన చరిత్ర కలిగినది. తెలంగాణ తల్లి విగ్రహం మన జాతియైన ఆకాంక్షలకు, మన భవిష్యత్తుకు ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది. పాలకుర్తిలో ఈ విగ్రహం ఏర్పాటవడం గొప్ప విషయం. ఇక్కడి ప్రజలు గొప్ప చరిత్రను కలిగి ఉన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది," అని పేర్కొన్నారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ..ఈ విగ్రహం స్థానిక ప్రజల ఆత్మగౌరవానికి, మహిళల సంక్షేమానికి ఒక ప్రతీక. తెలంగాణ ఆడబిడ్డ ఎదుగుదలకు ఇది చిహ్నంగా నిలుస్తుంది. పాలకుర్తిలో రెండవ విగ్రహం ఏర్పాటు చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను అని చెప్పారు.ఇంచార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ద్వారా మన సంస్కృతి, మన మూలాల పట్ల గౌరవాన్ని వ్యక్తీకరించాం. ఇది కేవలం విగ్రహ ఆవిష్కరణ మాత్రమే కాక, మహిళా శక్తికి అంకితమైన ఘట్టం కూడా, అని తెలిపారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పాల్గొని వేడుకను ఘనంగా నిర్వహించారు. విగ్రహానికి పూలతో అలంకరించడం, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
Comment List