సరిహద్దు గ్రామాల ప్రజలు జంకుతున్నారు...ఎందుకో తెలుసా
నమ్మలేం... వెళ్ళలేం...
లోకల్ గైడ్ :
ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్ తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో జమ్మూకశ్మీర్ సరిహద్దు గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించబడ్డ విషయం తెలిసిందే. ఇప్పుడు కాల్పుల విరమణ ఒప్పందం జరిగినా, వారు తిరిగి తమ ఇళ్లకు వెళ్లాలంటే జంకుతున్నారు. "పాక్పై నమ్మకం లేదు, ఎప్పుడు కాల్పులు జరుగుతాయో తెలీదు" అని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పహల్గాం ఉగ్రదాడికి భారత్ ఆపరేషన్ సిందూర్ ద్వారా గట్టి బదులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఘటనను జీర్ణించుకోలేని పాకిస్థాన్, సరిహద్దు గ్రామాలపై షెల్లింగ్ దాడులకు పాల్పడింది. దాంతో ప్రజలను తాత్కాలికంగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు.ఇప్పుడు కాల్పుల విరమణ ఒప్పందంతో పూంఛ్ ప్రాంతానికి చెందిన సంజీవ్ శర్మ కుటుంబంతో పాటు తిరిగి ఇంటికి వచ్చారు. అయితే పాక్ షెల్లింగ్ వల్ల ఆయన ఇంటి మొదటి అంతస్తు పూర్తిగా ధ్వంసమైందని తెలిపారు. "దాడులు ప్రారంభమైనప్పుడు మేము 12 మంది ఒకే కారులో ముఖ్యమైన వస్తువులు తీసుకుని బయటికి పరిగెత్తాం. ఆ దాడి మేము వెళ్లిన తర్వాత జరిగిందన్నదే మాకు ఊరట" అని చెప్పారు.పూంఛ్ ప్రజలు ఈ దాడుల్లో అత్యధికంగా ప్రభావితమయ్యారు. షెల్లింగ్లో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. "ఇంత తీవ్రతతో షెల్లింగ్ నేను ఇంతకు ముందు చూడలేదు" అని స్థానికుడైన ధరవాల్ సింగ్ జస్త్రోతియా పేర్కొన్నారు. "మా ఇంటిపై షెల్ పడినప్పుడు మేము 25 ఏళ్ల క్రితం నిర్మించిన బంకర్లో ఉండటంతో ప్రాణాలు దక్కాయి" అని తెలిపారు.ప్రస్తుతం పరిస్థితి కొంతమేరకు శాంతియుతంగా ఉన్నప్పటికీ, పాకిస్థాన్పై అవిశ్వాసం ప్రజల్లో కొనసాగుతోంది. వారు ఇప్పటికీ భయభ్రాంతుల్లో ఉన్నప్పటికీ, కాల్పుల విరమణ ఒప్పందం వల్ల కొంత ఊరట పొందినట్లు చెప్పారు. "మేము యుద్ధాన్ని కాదు, శాంతిని కోరుకుంటున్నాం. యుద్ధం అనేది విధ్వంసానికే మారుపేరు" అని వారు పేర్కొన్నారు.
Comment List