పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడం ఇప్పుడు మరింత ఈజీ.. జస్ట్ మిస్డ్కాల్ ఇస్తే చాలు!
లోకల్ గైడ్ :
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) సేవలు ఇప్పుడు మరింత సులభతరంగా మారాయి. ఈపీఎఫ్ ఖాతాదారులు తమ ఖాతా సమాచారం తెలుసుకోవాలంటే ఇకపై కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు, గానీ వెబ్సైట్ వాడాల్సిన పని కూడా లేదు. మిస్డ్ కాల్ ఇవ్వడం లేదా ఎస్ఎంఎస్ పంపడం ద్వారా ఖాతా వివరాలు తెలుసుకోవచ్చు. ఈ సేవలు పూర్తిగా ఉచితం, వాడడం చాలా సులభం, అంతేకాదు స్మార్ట్ఫోన్ లేదా ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే వీటిని ఉపయోగించవచ్చు.ఈ సేవలు పొందాలంటే, ఖాతాదారి యూఏఎన్ (UAN) క్రియాశీలంగా ఉండాలి. అలాగే యూఏఎన్కు బ్యాంక్ ఖాతా, ఆధార్ లేదా పాన్ నంబర్ లింక్ అయి ఉండాలి. అంతేకాదు, మొబైల్ నంబరు కూడా EPFO పోర్టల్లో నమోదు అయి ఉండాలి.
మిస్డ్ కాల్ సేవ:
9966044425 నంబరుకు రిజిస్టర్డ్ మొబైల్ నంబరు నుండి మిస్డ్ కాల్ ఇవ్వాలి. రెండు రింగ్లు అయిన వెంటనే కాల్ కట్ అవుతుంది. వెంటనే పీఎఫ్ కంట్రిబ్యూషన్, ప్రస్తుత బ్యాలన్స్ వివరాలు ఉన్న టెక్స్ట్ మెసేజ్ వస్తుంది. ఈ సేవలు రోజు 24 గంటలు, వారానికి 7 రోజులు అందుబాటులో ఉంటాయి.
ఎస్ఎంఎస్ సేవ:
రిజిస్టర్డ్ మొబైల్ నంబరు నుంచి EPFOHO UAN అని టైప్ చేసి 7738299899 నంబరుకు పంపించాలి. మీ ఖాతా కంట్రిబ్యూషన్, బ్యాలన్స్ సమాచారం మెసేజ్గా వస్తుంది.
ప్రాంతీయ భాషల్లో సమాచారం కావాలంటే:
యూఏఎన్ తరువాత ఆ భాషకు సంబంధించిన మూడు అక్షరాల కోడ్ను టైప్ చేయాలి. ఉదాహరణకి, తెలుగులో సమాచారం కావాలంటే EPFOHO UAN TEL అని టైప్ చేసి 7738299899 నంబరుకు పంపించాలి.
Comment List