మహారాష్ట్రలో ఈ ఏడాది ఎన్ని కోవిడ్ కేసులో తెలుసా.....
లోకల్ గైడ్
దక్షిణాసియాలో కొవిడ్-19 మళ్లీ విజృంభిస్తోంది. భారత్లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 257 యాక్టివ్ కేసులు ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే కొన్నిచోట్ల మరణాలు కూడా సంభవించడంతో ఆందోళన నెలకొంది.మహారాష్ట్రలో పరిస్థితి: ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు మహారాష్ట్రలో 100కి పైగా కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 6,066 స్వాబ్ టెస్ట్లు చేయగా, 106 మందికి పాజిటివ్ అని తేలింది. వారిలో 101 మంది ముంబై వాసులే కాగా, మిగతా వారు థానే, పూణె, కొల్హాపూర్ ప్రాంతాలకు చెందినవారిగా గుర్తించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 52 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 16 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అలాగే ఈ కాలంలో రెండు మరణాలు చోటు చేసుకున్నాయని, వారిలో ఒకరు క్యాన్సర్ రోగి అని అధికారులు తెలిపారు.దేశ స్థాయిలో పరిస్థితి: కేంద్ర ప్రభుత్వం ప్రకారం దేశంలో కొవిడ్ పరిస్థితి ప్రస్తుతం నియంత్రణలో ఉంది. అయినప్పటికీ పరిస్థితిని శ్రద్ధగా గమనిస్తున్నామని తెలిపింది. జలుబు, దగ్గు, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్నవారిపై ఆసుపత్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించింది.ఆసియా దేశాల్లో పెరుగుదల: సింగపూర్, చైనా, థాయ్లాండ్లలో కొవిడ్ వ్యాప్తి వేగంగా కొనసాగుతోంది. ఏప్రిల్ చివరి వారం నాటికి సింగపూర్లో 11,000 కేసులు నమోదవగా, మే మొదటి వారం నాటికి ఆ సంఖ్య 14,000 దాటింది. హాంకాంగ్లో మే ప్రారంభంలోనే 1,000కిపైగా కొత్త కేసులు వచ్చాయి, 33 మంది మరణించారు. చైనాలోనూ కేసులు పెరుగుతున్నాయి. ఫ్లూ లక్షణాలతో ఆసుపత్రులకు వెళ్లే వారి సంఖ్య సాధారణం కంటే రెట్టింపు అయ్యిందని సమాచారం. ఈ పెరుగుదలకు జేఎన్.1 వేరియంట్ మరియు దాని ఉపరకాలు ఎల్ఎఫ్.7, ఎన్బీ.1.8 కారణమని అధికారులు పేర్కొన్నారు.
Comment List