చార్ధామ్ యాత్రకు తగ్గిన భక్తుల రద్దీ...
లోకల్ గైడ్ :
చార్ధామ్ యాత్ర ఈ సంవత్సరం ఏప్రిల్ 30న ప్రారంభమైన సంగతి తెలిసిందే. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి యాత్రికుల సంఖ్య బాగా తగ్గిందని డెహ్రాడూన్కు చెందిన ఎస్డీసీ ఫౌండేషన్ అనే పర్యావరణ సంస్థ తెలిపింది. 2024లో యాత్ర ప్రారంభమైన మొదటి రెండు వారాల్లో వచ్చిన భక్తులతో పోలిస్తే, ఈ సంవత్సరం అదే కాలంలో 31 శాతం తక్కువగా పాల్గొన్నారని సంస్థ వెల్లడించింది.ఈ ఏడాది ఏప్రిల్ 30 నుండి మే 13 వరకు కేదార్నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి ధామాలను కలిపి మొత్తం 6,62,446 మంది దర్శించగా, గత ఏడాది మే 10 నుండి 23 వరకు జరిగిన 13 రోజుల యాత్రలో 9,61,302 మంది భక్తులు విచ్చేసినట్లు పేర్కొంది. భక్తుల సంఖ్య తగ్గడానికి పహల్గాం ఉగ్రదాడి ఘటన మరియు అనంతరం సరిహద్దుల్లో పాకిస్తాన్తో ఏర్పడిన ఉద్రిక్తతలే ప్రధాన కారణంగా పేర్కొంది. అయితే రాబోయే రోజుల్లో యాత్రికుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఎస్డీసీ ఫౌండేషన్ అంచనా వేసింది.
మే 15 నాటికి చార్ధామ్ యాత్రకు దాదాపు 28 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు వెల్లడైంది. 150కిపైగా దేశాల నుంచి 31,581 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరిలో ఎక్కువ మంది అమెరికా, నేపాల్, మలేషియా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా దేశాల నుంచి ఉన్నారు. ఉత్తరాఖండ్ హిమాలయాల్లో ఉన్న కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ధాములతో పాటు హేమకుండ్ సాహిబ్ దర్శించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నట్లు పర్యాటక శాఖ గణాంకాలు చెబుతున్నాయి.వివరాల ప్రకారం, నేపాల్ నుంచి 5,728 మంది, అమెరికా నుంచి 5,864, యూకే నుంచి 1,559, మారిషస్ నుంచి 837, ఇండోనేషియా నుంచి 327, కెనడా నుంచి 888, ఆస్ట్రేలియా నుంచి 1,259 మంది యాత్రికులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
Comment List