రేపటి నుండి కెనడాలో జీ7 సదస్సు.. హాజరుకానున్న ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ కెనడా పర్యటనలో ఎలాంటి మార్పులేదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. కెనడాలో రేపటి నుండి మూడు రోజుల పాటు జీ7 శిఖరాగ్ర సదస్సు జరగనుంది. జూన్ 15 నుండి 17 వరకు ఈ సమావేశం కొనసాగుతుంది. ఇందులో పాల్గొనాలని ప్రధానిని కోరుతూ కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ ఇటీవల ఫోన్ ద్వారా మోదీకి ఆహ్వానం అందించారు.భారత్–కెనడా మధ్య ఉన్న తాత్కాలిక విభేదాల వల్ల మోదీ ఈ సదస్సుకు హాజరుకావరని ఊహాగానాలు చెలరేగినప్పటికీ, ప్రభుత్వం వాటిని ఖండించింది. ప్రధాని మోదీ సదస్సుకు తప్పకుండా హాజరవుతారని, రేపు ఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్తారని అధికార వర్గాలు స్పష్టం చేశాయి.ప్రస్తుత ఇరాన్–ఇజ్రాయెల్ వివాదం నేపథ్యంలో ఈ జీ7 సదస్సు కీలకంగా మారింది. ఈ అంశంపై చర్చించి పరిష్కారం చూపాలని ప్రధాని మోదీ ప్రయత్నించే అవకాశం ఉంది. అలాగే, ఇటీవల పాకిస్తాన్పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విషయమై కూడా ప్రపంచ నాయకులతో చర్చించనున్నారని సమాచారం.
జీ7 అంటే ఏమిటి?
అత్యంత ఆధునిక, పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ఏడు దేశాల సమాఖ్య. అమెరికా, కెనడా, ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ, ఇటలీ, జపాన్ సభ్యదేశాలు. జీ7 అనే పేరు ఇందులో ఉన్న సభ్యదేశాల సంఖ్యకు సూచిక. భారత్ అధికారికంగా సభ్యదేశం కాకపోయినా ప్రతీ ఏడూ ఈ సమావేశానికి ఆహ్వానం అందుతోంది.
Comment List