గ్రామీణ బంద్ ను జయప్రదం చేయండి
గద్వాల, లోకల్ గైడ్ :
గ్రామీణ ఉపాధి హామీ పరిరక్షణ కొరకు ఈ నెల 20న జరిగే దేశవ్యాప్త గ్రామీణ బంద్ ను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఉప్పేర్ నరసింహ పిలుపునిచ్చారు. మంగళవారం చానుగొనిపల్లి, కొత్తపల్లి, గుంటిపల్లి గ్రామాలలో ఉపాధి కూలీలను కలిసి సమ్మె ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వలసలను నివారించి స్థానికంగానే ప్రజలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో వామపక్షాలు చేసిన పోరాటాల ఫలితంగా నాటి ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకం తీసుకవచ్చిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంపై వ్యవహరిస్తున్న విధానాల వల్ల వలసలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదన్నారు. దేశవ్యాప్తంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం పరిరక్షణకు ఉపాధి కూలీలు గ్రామీణ బంద్ కు పిలుపునిచ్చారని తెలిపారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలంటే ఏడాదికి రెండున్నర లక్షల కోట్లు అవసరమని, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో కేవలం 86 వేల కోట్లు మాత్రమే కేటాయించిందని విమర్శించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి ఉద్దేశపూర్వకంగా బడ్జెట్లో తక్కువ నిధులు కేటాయించిందని విమర్శించారు. ఉపాధి హామీకి బడ్జెట్లో నిధుల కేటాయింపు లలో కోత విధించడం వల్ల తక్కువ పని దినాలు అమలు చేయడం, పని ప్రదేశాలలో కనీస సౌకర్యాలు కల్పించకుండా ఉండటం, సంవత్సరాల తరబడి కూలీలు పెండింగ్ లో ఉండటం, కొత్త జాబ్ కార్డులు ఇవ్వకుండా ఉండటం, ప్రయాణం కరువు బత్యం చెల్లించకపోవడం వంటి చర్యలకు పాల్పడుతున్నదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన 300 రూపాయల కూలీ అమలు కావడం లేదని, కేవలం 150 నుండి 200 మాత్రమే కూలీల ఖాతాలలో జమ అవుతున్నదని అన్నారు. బడ్జెట్లో ఉపాధి హామీకి అధిక నిధులు కేటాయించాలని, ప్రతి కుటుంబానికి 200 పని దినాలు కల్పించాలని, కూలీలకు కనీస కూలీ 600 ఇవ్వాలని తదితర డిమాండ్లతో 20న జరిగే గ్రామీణ బంద్ లో ఉపాధి కూలీలు పని బంద్ చేసి సమ్మెలో పాల్గొని తమ నిరసన వ్యక్తం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధి కూలీలు కళ్యాణ్ నరేష్, రంగన్న, మరియమ్మ, సువార్త, వంశీ, శాకీర్, శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Comment List