ఇక అంతా ఆయన చేతుల్లో....
లోకల్ గైడ్ :
కేవలం అయిదు రోజుల్లో ఇద్దరు దిగ్గజులు భారత టెస్టు జట్టును వీడటం క్రికెట్ అభిమానులను షాక్కు గురిచేసింది. ముందు కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు గుడ్బై చెప్పగా, ఇప్పుడు విరాట్ కోహ్లీ కూడా అదే బాటలో నడవడం అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ ఇద్దరూ ఆట జీవిత చరమాంకంలో ఉన్నప్పటికీ, ఒకేసారి తప్పుకుంటారని ఎవరూ ఊహించలేదు.రోహిత్ నిష్క్రమణతో కొత్త కెప్టెన్ అవసరమవుతుండగా, యువ ఆటగాడు శుభ్మన్ గిల్కు ఆ బాధ్యతల్ని అప్పగించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అలాగే, సచిన్, కోహ్లీలు ఆడిన నాలుగో స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికర ప్రశ్నగా మారింది. ప్రస్తుతం జట్టులో అనుభవజ్ఞులుగా రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా మాత్రమే మిగిలారు. జడేజా కూడా ఆఖరి దశలో ఉండగా, బుమ్రా గాయాలతో కష్టపడుతున్నాడు. రాహుల్ నిలకడ చూపించకపోతే అతని స్థానం కూడా ప్రశ్నార్థకమే.ఇలాంటి తరుణంలో కోచ్ గౌతం గంభీర్కి ఈ యువ జట్టుపై పూర్తి అధికారం లభించే అవకాశం ఉంది. సెలక్షన్, ప్రణాళికలు అన్నింటిపైనా అతని ముద్ర స్పష్టంగా కనిపించనుంది. అయినా, అనుభవం కొరవడిన ఈ జట్టును నడిపించడంలో గంభీర్కు సవాళ్లే ఎక్కువ. రోహిత్, కోహ్లీ లేని తొలి సిరీస్ ఇంగ్లాండ్లో జరగడం కూడా కష్టతరమే.
ఈ సిరీస్లో జట్టు ఓడితే గంభీర్కి కోచ్గా ఇది వరుసగా మూడో పరాజయం అవుతుంది, ఫలితంగా అతను తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లే అవకాశముంది. కానీ ఈ యువ జట్టుతో ఇంగ్లాండ్ను ఓడిస్తే మాత్రం గంభీర్ పేరు వెలుగులోకి వస్తుంది. అప్పుడు భారత క్రికెట్లో కొత్త శకం ప్రారంభమైనట్లే. ఈ సంక్రమణ దశలో గంభీర్ జట్టును ఎలా నడిపిస్తాడో వేచి చూడాలి.
Comment List