రాజీవ్ యువ వికాసం స్కీమ్ తుది జాబితా విడుదల ఎప్పుడో తెలుసా
లోకల్ గైడ్:
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రాజీవ్ యువ వికాసం పథకం ప్రస్తుతం తుది దశకు చేరుకుంది. దరఖాస్తులు ప్రారంభమైనప్పటి నుంచీ అభ్యర్థులకు పలు సందేహాలు ఏర్పడినప్పటికీ, వాటిని ప్రభుత్వం సమర్థవంతంగా పరిష్కరించి, స్వీకరణ ప్రక్రియను పూర్తిచేసింది.అధికారుల సమాచారం మేరకు, దరఖాస్తుల పరిశీలన కూడా తుదిదశకు చేరిందని తెలిపారు. ప్రతి యూనిట్కు ఊహించని స్థాయిలో దరఖాస్తులు రావడంతో, ఎంపిక ప్రక్రియలో కొంత ఆలస్యం జరిగింది. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి యూనిట్ల స్థాపన కోసం రాయితీపై రుణాలు అందించనుంది. వ్యాపారాలు మరియు వృత్తుల కోసం ఈ రుణాలు ఇచ్చి యువత ఆర్థికంగా స్వావలంబిగా మారేలా చేయడం లక్ష్యం.
పెద్దపల్లి జిల్లాలో లబ్ధిదారుల ఎంపిక తుది దశలో ఉంది. ఎంపీడీవో మరియు మున్సిపల్ కార్యాలయాల ద్వారా అర్హుల జాబితాను బ్యాంకులకు అందజేశారు. బ్యాంకర్లు దరఖాస్తుదారుల ఎంపికలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే కలెక్టర్ ఇచ్చిన మే 14వ తేదీ చివరితేదీగా ఉన్నా ప్రక్రియ కొంత నెమ్మదిగా సాగుతోంది. ఇన్ఛార్జి మంత్రికి ఆమోదం లభించిన అనంతరం జూన్ 2న యూనిట్ల మంజూరు పత్రాలు పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.ఈ పథకానికి మొత్తంగా 47,470 దరఖాస్తులు అందగా, అందులో బీసీ, ఈబీసీ విభాగాల్లో 30,953 దరఖాస్తులు వచ్చాయి. అయితే అందుబాటులో ఉన్న యూనిట్లు కేవలం 5,158 మాత్రమే. ఎస్సీ వర్గానికి 4,146 యూనిట్లు ఉన్నా, దరఖాస్తులు 12,782 వచ్చాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులలో ఆందోళన నెలకొంది.ప్రస్తుతంలో, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో అర్హుల జాబితా ఖరారు చేయడంలో బ్యాంకర్లు సిబిల్ స్కోరు, గత రుణాల చరిత్ర, గత ఐదేళ్లలో కార్పొరేషన్ రుణాలు పొందారా అనే అంశాలపై దృష్టి పెడుతున్నారు. ఒక గ్రామంలో ఒకే రకమైన యూనిట్కు ఒకరికి మాత్రమే అవకాశం ఉండటంతో ఎంపికపై సందిగ్ధత నెలకొంది.అధికారులు దళారులపై నిఘా పెట్టినప్పటికీ, కొన్ని చోట్ల వారు అభ్యర్థులను మోసగించేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం. దళారులను ఆశ్రయించవద్దని అధికారుల హెచ్చరిక ఉంది. మరో రెండు రోజుల్లో పూర్తి జాబితా సిద్ధమవుతుందని అధికారులు పేర్కొంటున్నారు.
Comment List