టైటిల్ కోసం బెంగళూరు, పంజాబ్ పోరుకు సిద్ధం
– నేడు ఐపీఎల్ 18 ఫైనల్ – ఎవరు గెలిచినా చరిత్రే!
మహాభారతంలో పాండవులు 12 ఏళ్లు వనవాసం గడిపారు. రామాయణంలో రాముడు 14 ఏళ్లు అరణ్యవాసం చేశాడు. ఇప్పుడు ఆధునిక భారత క్రికెట్ చరిత్రలో, ఐపీఎల్ ప్రారంభమైన 2008 నుంచి టైటిల్ కోసం 18 ఏళ్లుగా ఆత్రంగా ఎదురు చూస్తున్న రెండు జట్లు – రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB), పంజాబ్ కింగ్స్ (PBKS) – తమ కలను నిజం చేసుకునే అవకాశాన్ని చివరకు పొందాయి. ఈ రోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగబోయే ఫైనల్లో ఈ రెండు జట్లూ తలపడనున్నాయి. ఇందులో ఎవరు గెలిచినా వారి పేరుతో ఐపీఎల్లో కొత్త చాంపియన్ పుట్టనుంది.
బలాబలాల పరంగా:
ఇరు జట్లు సమానంగా బలమైనవే. కొత్త కెప్టెన్సీతో ఈ సీజన్ను ప్రారంభించిన RCB, PBKS జట్లు అద్భుతమైన ఆటతీరుతో ఇప్పటికే పలు బలమైన జట్లను మట్టికరిపించాయి. లీగ్ దశలో తలా ఒకదాన్ని ఓడించుకున్న ఈ జట్లు, తొలి క్వాలిఫయర్లో బెంగళూరు పైచేయి సాధించింది. అయితే ముంబైని క్వాలిఫయర్ 2లో చిత్తుచేసిన పంజాబ్.. ఇప్పుడు బదులు తీర్చుకోవాలని సిద్ధమైంది.
బెంగళూరు బలాలు:
విరాట్ కోహ్లీ, సాల్ట్, పటీదార్, జితేశ్ శర్మ, టిమ్ డేవిడ్, లివింగ్స్టోన్ లాంటి బ్యాటింగ్ తారగణం. కోహ్లీ ఈ సీజన్లో 614 పరుగులు చేశాడు. హాజిల్వుడ్, భువనేశ్వర్, యశ్ దయాల్, కృనాల్, సుయాశ్ లాంటి బౌలర్లు మంచి ఫామ్లో ఉన్నారు.
పంజాబ్ బలాలు:
ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్సిమ్రన్, శ్రేయాస్, స్టోయినిస్, శశాంక్ సింగ్, నెహల్ వధేరా లాంటి బ్యాట్స్మెన్ అద్భుతంగా రాణిస్తున్నారు. శ్రేయాస్ 603 పరుగులు, ప్రభ్సిమ్రన్ 523, ప్రియాన్ష్ 451 పరుగులు చేశారు. అర్ష్దీప్, జెమీసన్, విజయ్కుమార్, చాహల్, హర్ప్రీత్ బ్రర్ వంటి బౌలర్లు కూడా మ్యాచ్లో మలుపు తిప్పగల సత్తా కలిగినవారు.
వేదిక పరిస్థితులు:
అహ్మదాబాద్ పిచ్ సాధారణంగా బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఎక్కువ. వర్షం పడితే మ్యాచ్ రిజర్వ్ డేకు వెళ్లే అవకాశముంది.
ఆసక్తికర విషయం:
శ్రేయాస్ ఐపీఎల్లో మూడు భిన్నమైన జట్లకు నాయకత్వం వహించి, మూడు టిమ్స్ను ఫైనల్కు చేర్చిన ఏకైక కెప్టెన్. 2020లో ఢిల్లీ, 2024లో కోల్కతా, 2025లో పంజాబ్ను ఫైనల్కు చేర్చాడు.
పంజాబ్కు ఇది రెండో ఫైనల్:
2014లో తొలిసారి ఫైనల్ చేరినప్పటికీ, ఆ సీజన్లో కోల్కతా చేతిలో ఓడిపోయింది. ఇప్పుడు వారు టైటిల్ గెలిచి తమ 11 ఏళ్ల ఎదురు చూపును ముగించాలని పట్టుదలతో ఉన్నారు.
Comment List