పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది
- జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీ నారాయణ.
గద్వాల, లోకల్ గైడ్ : పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, అందుకే విరివిగా మొక్కలు నాటి సంరక్షిస్తూ, ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించాలని జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీ నారాయణ అన్నారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కాలుష్య నియంత్రణ బోర్డు ఆధ్వర్యంలో విద్యార్థులుతో కలిసి కృష్ణవేణి చౌరస్తా నుండి పాత బస్టాండ్ వరకు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటున్నా మన్నారు. ప్లాస్టిక్ కాలుష్యాన్ని నివారిద్దామనే నినాదంతో ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2025ను నిర్వహించడం జరుగుతోందన్నారు. భూమి, నీరు, వాయువుల సంరక్షణతోపాటు మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చన్నారు. ఒకేసారి వినియోగించే ప్లాస్టిక్ వస్తువులను పూర్తిగా నిర్మూలించడం అత్యవసరమని, ప్రజలు దీనిపై అవగాహన కలిగి చర్యలు తీసుకోవాలన్నారు. పాలిథిన్ వ్యర్ధాలు భూమిలో కలవకుండా జాగ్రత్త పడితే భావి తరాలకు మేలు చేసినట్లు అవుతుందన్నారు. ఎక్కువ మొక్కలను నాటి, సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.ప్రకృతిని ప్రేమిస్తూ పర్యావరణాన్ని రక్షించడం వలన ప్రకృతి మన భవిష్యత్తరాలకు మేలు చేస్తుందన్నారు. ప్రతి ఇంటి ముందు మొక్కలను నాటడంతో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుందని, చెట్లను కాపాడుకునేందుకు ప్రజలందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.
అనంతరం పర్యావరణ పరిరక్షణకు అందరూ కంకణబద్ధులై ఉంటామని, ప్లాస్టిక్ నిర్మూలన, మొక్కలను నాటి సంరక్షిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ రావు, సహాయక పర్యావరణ శాస్త్రవేత్త డాక్టర్ విద్యులత ఈ.డి ఎస్సీ కార్పొరేషన్ రమేష్ బాబు, ఎఫ్.ఆర్.ఓ పర్వేజ్ అహ్మద్, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
Comment List