భక్తి విశ్వాసాలకు బక్రీద్ పండుగ ప్రతీక షాద్ నగర్ ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్"
ఫరూక్ నగర్ ఈద్గా వద్ద ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
హాజరైన షాద్ నగర్ ఏసిపి లక్ష్మీనారాయణ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్, జమ్రుద్ ఖాన్ తదితరులు
ఈద్ ఉల్-అధా (బక్రీద్) పర్వదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులకు షాద్ నగర్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఫరూక్ నగర్ ఈద్గా వద్ద బక్రీద్ పర్వదినం సందర్భంగా నిర్వహించిన ఈదుల్ అదా నమాజ్ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరయ్యారు. మున్సిపల్ శాఖ ఏర్పాటు చేసిన శుభాకాంక్షలు వేదిక వద్ద ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ఏసిపి లక్ష్మీనారాయణ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్, సీఐ విజయ్ కుమార్, పట్టణ మాజీ కౌన్సిలర్ సర్వర్ పాషా, జమృత్ ఖాన్ తదితరులు ముస్లిం సోదరులకు అలైబలై తీసుకుంటూ శుభకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ బక్రీద్ పండుగను పురస్కరించుకొని ఈద్గా వద్ద మీడియాతో మాట్లాడుతూ..
త్యాగానికి, సహనానికి, భక్తి విశ్వాసాలకు బక్రీద్ పండుగ ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. శాంతి, కరుణ, సహనం, సామరస్యం, ఐకమత్యం, సోదరభావం స్ఫూర్తితో ఈ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. అదేవిధంగా భాగస్వామ్యం, దానధర్మం, గౌరవం, అవసరమైన వారికి సాయం చేయడం బక్రీద్ పండుగ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. దేవుడిపై విశ్వాసంతో సన్మార్గంలో జీవనం సాగించాలని సందేశాన్ని బక్రీద్ ఇస్తుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు.
Comment List