ముందుగానే కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు
లోకల్ గైడ్:
నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయని, మరో నాలుగు నుంచి ఐదు రోజులలో కేరళను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఈనెల 27వ తేదీ నాటికల్లా రుతుపవనాలు కేరళకు చేరుకోవచ్చని మొదట అంచనా వేసిన ఐఎండీ, ఇప్పుడు అది అంతకంటే ముందే తాకే అవకాశముందని తెలిపింది. ఇది నిజమైతే, 2009 తర్వాత నైరుతి రుతుపవనాలు ముందుగా వచ్చిన మొదటి సందర్భం అవుతుందని చెప్పింది.
ఈ ఏడాది అధిక వర్షపాతం అవకాశం
ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. సాధారణంగా రుతుపవనాలు జూన్ 1న కేరళలో ప్రవేశిస్తాయి, జూలై 8 నాటికి దేశమంతా విస్తరిస్తాయని తెలిపింది. అదే విధంగా సెప్టెంబర్ 17న వాయువ్య భారతం నుంచి ఉపసంహరణ ప్రారంభమై, అక్టోబర్ 15 నాటికి పూర్తవుతుంది. గతేడాది మే 30న రుతుపవనాలు దేశంలో ప్రవేశించగా, 2022లో ఇది మే 23న ప్రారంభమైందని తెలిపింది.
రుతుపవనాల ప్రాధాన్యత
దేశంలో సాగుభూమిలో సుమారు 52% వర్షపాతం మీద ఆధారపడి ఉంటుందని తెలిపింది. అందువల్ల నైరుతి రుతుపవనాలు భారతదేశ ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వంలో కీలకపాత్ర పోషిస్తాయని వివరించింది. జలాశయాలను నింపడం, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తి వంటి కీలక అవసరాలకు ఇవి ప్రధాన ఆధారమని పేర్కొంది. అంతేకాకుండా దేశ జీడీపీలో 18.2% కు ఈ వర్షపాతమే తోడ్పడుతుందని వెల్లడించింది.
తెలంగాణలో వర్ష సూచన
తెలంగాణలో వచ్చే నాలుగు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ద్రోణి ప్రభావంతో కొన్ని జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.మంగళవారం వర్షం కురిసిన జిల్లాల్లో భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలు ఉన్నాయి. భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలోని అశ్వాపురంలో అత్యధికంగా 5.92 సెం.మీ వర్షపాతం నమోదైంది.
Comment List