భారత క్రికెట్లో కొత్త శకం ఆరంభమయ్యే సూచనలు
లోకల్ గైడ్ :
పెద్ద విరామం తర్వాత, టెస్టు జట్టుకు ఓ యువ కెప్టెన్ బాధ్యతలు స్వీకరించే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల టెస్టు ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన కెప్టెన్ రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేయబోతున్న వారసుడెవరో, ఈ శనివారం అధికారికంగా తేలనుంది.అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సీనియర్ సెలక్షన్ కమిటీ, వచ్చే నెల 20వ తేదీ నుంచి ఇంగ్లాండ్తో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించనుంది. తాజా సమాచారం మేరకు, యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ను టెస్టు కెప్టెన్గా ఎంపిక చేసే అవకాశం కనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితమే గిల్, అగార్కర్తో పాటు కోచ్ గౌతమ్ గంభీర్ను కూడా భేటీ అయినట్లు వార్తలు వచ్చాయి.ఇక, గతంలో వైస్ కెప్టెన్గా వ్యవహరించిన జస్ప్రీత్ బుమ్రా పేరు కూడా కెప్టెన్సీ రేసులో వినిపించినా, అతని ఫిట్నెస్ సమస్యల కారణంగా సెలక్టర్లు అతనిపై ఎక్కువ భారం మోపే అవకాశాలు కనిపించడం లేదు.భవిష్యత్ దృష్టిలో ఉంచుకొని గిల్నే నాయకత్వ బాధ్యతలు అప్పగించే అవకాశాలు మెరుగుగా ఉన్నాయి. అతనికి సహాయంగా వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ వైస్ కెప్టెన్గా ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి.ఇక, ఐపీఎల్లో అద్భుతంగా రాణిస్తున్న తమిళనాడు యువకుడు సాయి సుదర్శన్కి జట్టులో స్థానం లభించనుంది. అలాగే, కర్ణాటక బ్యాటర్ కరుణ్ నాయర్కి కూడా మంచి అవకాశాలున్నాయి. వన్డేలు మరియు ఐపీఎల్లో నిలకడగా రాణిస్తున్న శ్రేయస్ అయ్యర్కి టెస్టు జట్టులో తిరిగి చోటుదక్కుతుందా అన్నదే ఇప్పుడు ఆసక్తికరమైన అంశం.పేస్ విభాగంలో బుమ్రా, సిరాజ్లతో పాటు, ప్రసిద్ధ్ కృష్ణ, అర్షదీప్ సింగ్, ఆకాశ్ దీప్ వంటి యువ బౌలర్లకు కూడా ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి.
Comment List