తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దిల్ రాజు
ప్రముఖ నిర్మాత మరియు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు.ఇదిలా ఉండగా, సోమవారం హైదరాబాద్లో జరిగిన మీడియా సమావేశంలో దిల్ రాజు మాట్లాడుతూ, పవన్కల్యాణ్ తమకు అన్నలాంటివారని, ఆయన తిడితే తట్టుకోవాల్సిందేనని తెలిపారు. పవన్ హర్ట్ అయ్యారన్న మాట వాస్తవమేనని, కానీ సినిమా పై జరుగుతున్న విమర్శలు తప్పుడు ప్రచారంగా అభివర్ణించారు.తూర్పు గోదావరిలో ప్రారంభమైన పర్సంటేజీ సమస్యకు సంబంధించి చర్చలు జరిగాయని, ఈ సమస్యను తెలంగాణకు అన్వయించడం తప్పుడు వ్యాఖ్యల వల్లే జరిగిందన్నారు. ‘హరిహర వీరమల్లు’ సినిమా రిలీజ్ వాయిదా కూడా ఈ సమస్యల వల్లే చోటుచేసుకుందని వివరించారు.థియేటర్ల బంద్ వార్తలు తప్పుగా ప్రచారంలోకి వచ్చాయని, నిర్మాతలంతా కలిసి దీనిపై స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశామని చెప్పారు. పవన్ సినిమా రిలీజ్ను అడ్డుకునే ధైర్యం ఎవరికీ లేదని స్పష్టం చేశారు.నైజాంలో తమ సంస్థకు 30 థియేటర్లే ఉన్నాయని, మీడియాలో 'ఆ నలుగురు' అంటూ చేసే ప్రచారం నిరాధారమన్నారు. అన్ని ప్రాంతాల్లో ఇండస్ట్రీకి ప్రభుత్వాల మద్దతు ఉందని, సమస్యలు ప్రభుత్వ స్థాయిలోనే పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
Comment List