రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లను చేయాలి
- జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ.
గద్వాల, లోకల్ గైడ్ :
జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన చాంబర్ లో శనివారం జూన్ 2న నిర్వహించే రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా వివిధ శాఖల అధికారులతో జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవన ఆవరణలో ఉదయం 10 గంటలకు నిర్వహించే రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఆయా శాఖల వారీగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎలాంటి లోటు పాట్లకు తావులేకుండా అట్టహాసంగా వేడుకలు జరిగేలా ఆయా శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిబింబించేలా వివిధ శాఖలు ప్రదర్శన స్టాళ్లను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.
పట్టణ కేంద్రంలోని స్మృతి వనం, పాత బస్టాండ్ వద్ద గల తెలంగాణ పోరాట యోధుల విగ్రహాల వద్ద, సభాస్థలి వేదికలను పూలతో అందంగా అలంకరించాలని, సభావేదిక, సీటింగ్ ఏర్పాట్లతో పాటు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పోలీసు గౌరవ వందనంతో పాటు వేడుకలలో పోలీసు బందో బస్త్ ఏర్పాట్లు చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. బాల భవన్, పాఠశాలల విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని డిఈఓ కు సూచించారు. వేడుకల ఏర్పాట్లలో ఎక్కడ ఎలాంటి పొరపాట్లు జరగకుండా విజయవంతంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగరావు, ఆర్డిఓ శ్రీనివాసరావు, ఏ ఓ భూపాల్ రెడ్డి, డి.ఎస్.పి మొగులయ్య, తహసిల్దార్ మల్లికార్జున్, మున్సిపల్ కమిషనర్ దశరథ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comment List