పేదవారి ఆత్మగౌరవ ప్రతీక సొంత ఇల్లు
- పేద ప్రజలందరికీ గూడు, నీడ కల్పించడం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
- ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు త్వరగా ఇండ్లు నిర్మించుకోవాలి
వరంగల్ ( లోకల్ గైడ్ ): వర్ధన్నపేట మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు వర్ధన్నపేట మండల, టౌన్ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద దేవి లతో కలిసి వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు గారు మాట్లాడుతూ పేదవారి ఆత్మగౌరవ ప్రతీక సొంత ఇల్లు అని తాము ఇచ్చిన హామీ మేరకు ఇంటి స్థలం, భూమి పత్రాలు ఉన్న పేదలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. నిర్ణీత సమయం, ప్రభుత్వం సూచించిన కొలతల ప్రకారం ఇల్లు నిర్మించుకొని సహాయం పొందాలని పిలుపునిచ్చారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేసే సమయంలో ఏదో ఒక సారి మీ ఇంటికి వస్తానని, ఒక తోబుట్టువు వలె అండగా ఉంటానని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు 4 దశలలో 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందుతుందని, 400 చదరపు అడుగుల నుంచి 600 చదరపు అడుగుల లోపు ఇంటి నిర్మాణం చేసుకోవాలని స్పష్టం చేశారు. 4 దశలో గ్రీన్ చానల్ ద్వారా ఆర్థిక సహాయం అందుతుందని వెల్లడించారు. బేస్మెంట్ నిర్మాణం పూర్తైన తర్వాత లక్ష రూపాయలు, గోడలు నిర్మిస్తే లక్ష రూపాయలు, స్లాబ్ నిర్మించిన తరువాత 2 లక్షల రూపాయలు, ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత మరో లక్ష రూపాయలు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ అవుతాయని తెలిపారు. రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకెళ్తున్నారని, గత ప్రభుత్వం పెట్టిన ఒక్క పథకాన్ని కూడా రద్దు చేయకుండా వాటిని కొనసాగిస్తూ.. నూతన పథకాలను అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మాట మేరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 కు సిలిండర్, 10 లక్షల ఆరోగ్య శ్రీ, నూతన రేషన్ కార్డులు, సన్నం బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. రైతులకు ఏక కాలంలో 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. గురుకులాల్లో ఒకే రకమైన భోజనం అందించాలని కామన్ డైట్ ప్రోగ్రాం అమలు చేస్తున్నామని.. గురుకులాల్లో డైట్ చార్జీలు, కాస్మొటిక్ చార్జీలు పెంచడం జరిగిందని తెలిపారు. గత పది సంవత్సరాలుగా వర్ధన్నపేట నియోజకవర్గంలోని ప్రజలు ఎంతగానో ఇండ్ల కోసం ఎదురు చూశారని.. కానీ ప్రజాప్రభుత్వం వచ్చిన 15 నెలల్లోనే ఇండ్ల పత్రాలను పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఇండ్ల మంజూరు పత్రాలను అందుకుంటున్న ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలియ చేశారు. అలాగే మీకు ఏ సమస్య ఉన్న నా డయల్ యువర్ ఎమ్మెల్యే 8096107107 కి ఫోన్ చేసి మీ సమస్య తెలియజేసే త్వరితగతన మీ సమస్య పరిష్కరించే విధంగా కృషి చేస్తాను అన్నారు.ఈ కార్యక్రమంలో వరంగల్ జెడ్పీ సీఈఓ, డిసివో, హౌసింగ్ పీడీ, వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, ఎమ్మార్వో విజయ సాగర్,ఎంపీడీవో వెంకటరమణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్బిడి రాజిరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ, జిల్లా కాంగ్రెస్ నాయకులు పోశాల వెంకన్న గౌడ్, శ్రీపాది సతీష్ వివిధ శాఖల అధికారులు ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
Comment List