రూ.3వేలు దాటిన యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు..?
లోకల్ గైడ్:
ప్రస్తుతం దేశం మొత్తం ఆన్లైన్ చెల్లింపులతో నిండిపోయింది. టీ స్టాల్లో రూ.10 చెల్లించడానికీ గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్లనే వాడుతున్నారు. చిన్న మొత్తాల నుంచి పెద్ద మొత్తాల వరకూ అంతా డిజిటల్ పేమెంట్లే.ఇప్పటివరకు యూపీఐ సేవలు పూర్తిగా ఉచితంగా అందించబడ్డాయి. అయితే త్వరలో యూపీఐ లావాదేవీలపై మర్చంట్ ఛార్జీలు (Merchant Charges) వసూలు చేయాలన్న అంశాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకుందని సమాచారం. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) వ్యవస్థపై మళ్లీ మర్చంట్ డిస్కౌంట్ రేటు (MDR)ను ప్రవేశపెట్టే అంశంపై చర్చలు జరుగుతున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.ప్రస్తుత ప్రతిపాదన ప్రకారం, రూ.3,000కి మించిన లావాదేవీలపై మాత్రమే ఛార్జీలు విధించే అవకాశం ఉంది. చిన్న మొత్తాలపై మాత్రం ఎలాంటి ఫీజులు ఉండవు. ప్రధానమంత్రి కార్యాలయం, ఆర్థిక వ్యవహారాల శాఖ, ఆర్థిక సేవల విభాగాల మధ్య ఈ అంశంపై చర్చలు జరుగుతున్నట్టు జాతీయ మీడియా పేర్కొంది.ఇప్పటికే 2022లో ప్రభుత్వం యూపీఐ, రూపే లావాదేవీలపై MDR ఛార్జీలను రద్దు చేసింది. ఇప్పుడు మళ్లీ వీటిని ప్రవేశపెట్టినప్పటికీ, యూజర్లపై నేరుగా ఎలాంటి ప్రభావం ఉండదని అంటున్నారు. ఎందుకంటే ఈ ఛార్జీలు వినియోగదారుల నుంచి కాకుండా వ్యాపారుల నుంచే వసూలు చేస్తారు. అయితే దీని వల్ల కొందరు వ్యాపారులు మళ్లీ నగదు చెలామణి వైపు మొగ్గు చూపే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.అదే సమయంలో, యూపీఐ లావాదేవీలు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తెలిపిన వివరాల ప్రకారం, 2025 మే నెలలో రూ.25.14 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి. ఇది ఏప్రిల్లో నమోదైన రూ.23.94 లక్షల కోట్లతో పోలిస్తే సుమారు 5% పెరుగుదల. మేలో మొత్తం 1,867.7 కోట్ల యూపీఐ లావాదేవీలు జరగగా, ఏప్రిల్లో 1,789.3 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. గత ఏడాది మే నెలతో పోలిస్తే 23% వార్షిక వృద్ధి నమోదైనట్టు సమాచారం.ఈ సూచనలతో, డిజిటల్ ఇండియా పయనం మరింత వేగంగా సాగుతోంది.
Comment List