ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యం - డీఈఓ రమేష్ కుమార్
ఈ విద్యా సంవత్సరం 230 రోజుల పనిదినాలు
ప్రణాళికబద్ధంగా పాఠ్యాంశాలు అమలు చేయాలి
లోకల్ గైడ్ నాగర్ కర్నూల్ జిల్లా :
నేటి నుంచి పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి. నూతన విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణం పాఠశాలల్లో ఉండేలా చర్యలు తీసుకున్నాం. సౌకర్యాలు, నాణ్యమైన విద్యను అందించడం ద్వారా ఈ ఏడాది మెరుగైన ఫలితాలు సాధించడమే ధ్యేయమని నాగర్ కర్నూల్ జిల్లా విద్యాశాఖాధికారి ఏ. రమేష్ కుమార్ తెలిపారు.గురువారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానుండటంతో అందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసామని తెలిపారు. విద్యా సంవత్సరం ప్రారంభం రోజు పాఠశాలకు వచ్చే విద్యార్థులు ఆహ్లాదకర వాతావరణంలో అడుగుపెట్టేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు.
ఇప్పటికే జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలు పరిశుభ్రంగా ఉండేలా, చక్కని వాతావరణం కల్పించేలా జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశాల మేరకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. విద్యార్థులకు ఎటువంటి సమస్యలూ లేకుండా ఫర్నిచర్, తరగతి గదుల పరిశుభ్రత సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.ఈ నూతన విద్యా సంవత్సరం2025-26 విద్యా సంవత్సరంలో విద్యా ప్రమాణాలు మెరుగుదలకు పాఠశాలల ప్రారంభం నుంచే చర్యలు తీసుకుంటున్నామని డిఇఓ స్పష్టం చేశారు. అందులో భాగంగానే గత నెలలోనే జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులందరికీ రెండు విడతలుగా సబ్జెక్ట్ ఉపాధ్యాయులకు బోధనపై శిక్షణా తరగతులను పూర్తి చేసినట్లు తెలిపారు. పాఠశాలల ప్రారంభం నాటికి బోధనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలు, మెలకువలు, సబ్జెక్టుల వారిగా వివరించేందుకు ఉపాధ్యాయులకు రెండు దశల్లో శిక్షణా తరగతులు చేపట్టామని తెలిపారు. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించేందుకు జూన్ 6వ తేదీ నుంచి గ్రామాల్లో బడిబాట ద్వారా ప్రచారం జరిగిందని, ఈ వారమంతా ఉపాధ్యాయులు ఆ పనిలో ఉంటారన్నారు. దీంతోపాటు అంగన్వాడీలో చదివిన పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించే ప్రక్రియ సాగుతోందని, ప్రభుత్వం విద్యార్థులకు అందించే సౌకర్యాలు, విద్యా బోధన గురించి వివరించి, గత ఏడాది కంటే ఎక్కువ మంది చేరేలా కృషి చేస్తున్నట్లు డిఈఓ తెలిపారు.
ఈ ఏడాది విద్యా ప్రమాణాల మెరుగుదలతో పాటు మెరుగైన ఫలితాల సాధన కోసం విద్యా సంవత్సరం ఆరంభం నుంచే సబ్జెక్ట్ టీచర్లకు బాధ్యత అప్పగిస్తామని, పాఠ్యాంశాలు బోధించిన వెంటనే అదనపు స్టడీ అవర్స్ నిర్వహించడం, జరిగిన ప్రతి పాఠంపై పరీక్ష పెట్టడం వంటి ప్రణాళికలను అమలు చేసి పదో తరగతిలో కూడా గత ఏడాది కంటే మెరుగ్గా ఫలితాలు ఉండేలా కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తామని డీఈవో తెలిపారు.నూతన విద్యా సంవత్సరం అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాదిలో విద్యార్ధులకు మొత్తం 230 పనిదినాలుగా రాష్ట్ర విద్యాశాఖ ఖరారు చేశారని, పని దినాల్లో ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు కొనసాగుతాయని, ఇక ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4:15 గంటల వరకు నడవనున్నట్లు డిఇఓ పేర్కొన్నారు.అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి రోజు కనీసం 90 శాతం విద్యార్థులు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఇక పదో తరగతి విద్యార్ధులకు 2026 జనవరి 10లోగా సిలబస్ను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 1 నుంచి 9 తరగతుల విద్యార్ధులకు సిలబస్ను ఫిబ్రవరి 28లోగా పూర్తి చేసి , పాఠశాలల్లో ప్రతి రోజు 5 నిమిషాలు యోగా, ధ్యానం చేయించాలని డిఇఓ రమేష్ కుమార్ ప్రధానోపాధ్యాయులకు సూచించారు.నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా ఈ విద్యా సంవత్సరం పదో తరగతి చదివే విద్యార్ధులకు పబ్లిక్ పరీక్షలు 2026 మార్చిలో జరగనున్నాయని,ప్రతి రోజు 30 నిమిషాలపాటు విద్యార్థుల చేత చదివించేలా ప్రతి పాఠశాల స్థాయిలో అకాడమిక్ క్యాలెండర్ షెడ్యూల్ను రూపొందించి, ఆగస్టు మొదటి లేదా రెండో వారంలో పాఠశాల స్థాయిలో ఆటల పోటీలు, ఆగస్టు మూడో వారంలో జోనల్ టోర్నమెంట్స్ నిర్వహించి జిల్లా సెలక్షన్స్ పూర్తి చేయాలని, ప్రతి నెలా మూడో శనివారం తల్లిదండ్రుల సమావేశాలు అమలు చేయాలని, రోజుకు 30 నిమిషాలపాటు పాఠ్యపుస్తకాలు, స్టోరీబుక్స్, దినపత్రికలు, మ్యాగ్జిన్లు వంటి వాటిని విద్యార్ధుల చేత చదివించాలని డిఇఓ ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
Comment List