శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు
నెలవారీ నేర సమీక్షా సమావేశంలో ఎస్పీ రోహిత్ రాజు
భద్రాద్రి కొత్తగూడెం లోకల్ గైడ్ ప్రతినిధి :
ఎస్పీ రోహిత్ రాజు వారి కార్యాలయలోని కాన్ఫరెన్స్ హాలు నందు జిల్లా పోలీస్ అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశాన్ని సోమవారం ఏర్పాటు చేశారు..ఈ సమావేశంలో పాల్గొన్న పోలీస్ అధికారులతో ఎస్పీ మాట్లాడుతూ ప్రతీ కేసులో 'క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్' ద్వారా నేరస్తులకు శిక్షపడే విధంగా చేసి బాధితులకు న్యాయం చేకూర్చాలని సూచించారు.కేసుల విచారణలో జాప్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.పోలీస్ అధికారులంతా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై క్రమశిక్షణా చర్యలు తప్పవని అన్నారు.పెట్రోలింగ్,బ్లూ కోల్ట్స్ వాహనాలతో అధికారులు,సిబ్బంది ఎల్లప్పుడూ రోడ్లపై తిరుగుతూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.గంజాయి వంటి మత్తు పదార్ధాలు,మట్కా,జూదం లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.జిల్లా వ్యాప్తంగా హాట్ స్పాట్స్ ను గుర్తించి గంజాయిని రవాణా చేసే వ్యక్తులతో పాటు గంజాయిని సేవించే వారిపై కూడా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని ప్రదేశాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు.సీసీ కెమెరాల ప్రాముఖ్యత గురించి ప్రజలలో అవగాహన కల్పించి తమ తమ నివాస ప్రాంతాల్లో మరియు వ్యాపార సముదాయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా చేయాలని తెలిపారు.ప్రాపర్టీ కేసుల్లో ప్రస్తుతం పోలీసు శాఖ వినియోగిస్తున్న సాంకేతికతను ఉపయోగించి నేరస్తులను పట్టుకుని సొత్తును రికవరీ చేసి భాదితులకు త్వరతగతిన అందేలా చూడాలని తెలిపారు.రాబోయే వర్షాకాలంలో అధిక వర్షాలు సంభవించినపుడు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసే విధంగా ముందస్తుగానే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు.సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని కోరారు.జిల్లా వ్యాప్తంగా సైబర్ నేరాల్లో నగదును కోల్పోయి,భాధితులు వెంటనే స్పందించి ఫిర్యాదు చేసినప్పుడు తక్షణమే స్పందించి వారికి అండగా ఉండాలని సూచించారు.ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి(బ్లాక్ స్పాట్స్) వాటి నివారణకై సంబంధిత అధికారులతో సమన్వయం పాటిస్తూ ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ బాధితులకు న్యాయం చేకూరేలా పనిచేయాలని తెలిపారు.మద్యం సేవించి వాహనాలను నడుపుతూ,ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యే వారి గురించి నిరంతరం వాహన తనిఖీలు చేపట్టి పట్టుబడిన వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ సమావేశంలో కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్,పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్,ఇల్లందు డిఎస్పీ చంద్ర భాను,మణుగూరు డిఎస్పీ రవీందర్ రెడ్డి,డీసీఆర్బీ డిఎస్పీ మల్లయ్య స్వామి మరియు జిల్లాలోని ఇన్స్పెక్టర్స్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Comment List