రేపు ఇంగ్లాండ్తో జరగబోయే టెస్ట్ సిరీస్కు భారత జట్టు ఎంపిక చేసే అవకాశం
లోకల్ గైడ్:
ఇంగ్లాండ్తో జరగబోయే టెస్ట్ సిరీస్కు సంబంధించిన భారత జట్టు ఎంపికను మే 24న (శనివారం) ప్రకటించే అవకాశముందని అంచనా. భారత్ పర్యటన జూన్ 20న హెడింగ్లీలో ప్రారంభమవుతుంది. అనంతరం ఎడ్జ్బాస్టన్, లార్డ్స్, ఓల్డ్ ట్రాఫోర్డ్, ది ఓవల్లో మ్యాచ్లు జరుగుతాయి. భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ముంబయిలో నిర్వహించే మీడియా సమావేశంలో జట్టును ప్రకటించే అవకాశం ఉంది. అయితే మే 24 లేదా 25న జట్టు ప్రకటిస్తారా అనే విషయంలో స్పష్టత లేకపోయినా, బీసీసీఐ వర్గాల ప్రకారం శనివారమే ప్రకటించే అవకాశముందని జాతీయ మీడియా చెబుతోంది.అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ ముందుగానే జట్టును ఎంపిక చేయాల్సి ఉన్నా, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టెస్ట్ ఫార్మాట్కు వీడ్కోలు పలికిన నేపథ్యంలో ఎంపిక ప్రక్రియ రెండు వారాలు వాయిదా పడింది. ప్రస్తుతం టెస్ట్ కెప్టెన్ పదవికి శుభ్మన్ గిల్ ప్రధానంగా కనిపిస్తున్నాడు. అయితే జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ కూడా రేసులో ఉన్నారు. గుజరాత్ టైటాన్స్ను ఐపీఎల్ ప్లేఆఫ్కు చేర్చి శుభ్మన్ గిల్ మంచి గుర్తింపు పొందాడు.గిల్తో పాటు గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ బీ సాయి సుదర్శన్ కూడా నార్తాంప్టన్లో ఇంగ్లాండ్ లయన్స్తో జరుగే రెండో మ్యాచ్కు ముందు భారత్ ‘ఏ’ జట్టుతో కలవనున్నారు. టెస్ట్ జట్టు సభ్యులైన యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్లు మే 30న మొదటి మ్యాచ్కు ముందు, మే 25నే భారత్ ‘ఏ’ జట్టు సభ్యులతో కలిసి ఇంగ్లాండ్కు ప్రయాణించే అవకాశం ఉంది. ఆదివారం సాయంత్రం ఢిల్లీలో జరుగనున్న సన్రైజర్స్ హైదరాబాద్ vs కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్ అనంతరం, మే 26న ఉదయం నితీశ్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, హర్షిత్ రాణా, హర్ష్ దూబేలు కూడా న్యూఢిల్లీ నుంచి ఇంగ్లాండ్కు బయలుదేరే అవకాశం ఉంది. కాగా, కేకేఆర్, ఎస్ఆర్హెచ్ ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి బయటపడ్డాయి.
Comment List