దేశంలో 1000 దాటిన కరోనా కేసులు......
దేశంలో కరోనా వైరస్ మళ్లీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటికే పలువురు రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదవుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో యాక్టివ్ కేసుల సంఖ్య 104కి చేరింది. గత వారం రోజుల్లోనే అక్కడ 99 మందికి కొత్తగా కరోనా సోకింది. కేరళలో కేసుల సంఖ్య 400 దాటగా, దేశవ్యాప్తంగా క్రియాశీల కేసులు 1009కు పెరిగాయి. గడచిన వారం రోజుల వ్యవధిలో కొత్తగా 750 మందికి కరోనా సోకినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది.ఇక అంతర్జాతీయంగా హాంకాంగ్, సింగపూర్, థాయిలాండ్, చైనాల్లో కరోనా తీవ్రంగా వ్యాపిస్తోంది. వారానికి వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. ఈ వ్యాప్తికి జేఎన్.1 వేరియంట్ మరియు దాని ఉపరకాలు ప్రధాన కారణంగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. సింగపూర్ ఆరోగ్య శాఖ ప్రకారం జేఎన్.1 ఉపరకాలు ఎల్ఎఫ్.7, ఎన్బీ.1.8 వేరియంట్లు అక్కడ వేగంగా విస్తరిస్తున్నాయి. బాధితుల్లో జ్వరం, ముక్కు కారడం, గొంతునొప్పి, తలనొప్పి, నీరసం వంటి స్వల్ప లక్షణాలు కనిపిస్తున్నాయని, సాధారణంగా నాలుగు రోజుల్లోనే కోలుకుంటున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు.ఈ వేరియంట్లను భారత్లో కూడా గుర్తించినట్లు ఇండియన్ సార్స్-కోవ్-2 జీనోమిక్స్ కన్సార్టియం (INSACOG) గత వారం ప్రకటించింది. కేసుల పరంగా కేరళలో అత్యధికంగా ఉండగా, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. తాజాగా బీహార్లో కూడా తొలి కేసు నమోదైంది. అయితే ఇప్పటివరకు నమోదవుతున్న కేసుల తీవ్రత తక్కువగానే ఉందని, అయినా పరిస్థితిని జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.
Comment List