భూ సమస్యలను సాధ్యమైనంత వరకు రెవెన్యూ సదస్సులోనే పరిష్కరించాలి
వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్
వికారాబాద్ జిల్లా, లోకల్ గైడ్
శుక్రవారం వికారాబాద్ మునిసిపల్ పరిధిలోని ఎన్నేపల్లిలో నిర్వహించిన రెవెన్యూ సదస్సును జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆకస్మికంగా సందర్శించారు. అర్జీదారుల సమస్యలను స్వయంగా వివరాలు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. భూ సమస్యల పరిష్కార వేదికలుగా రెవెన్యూ సదస్సులు ఎంతగానో ఉపయోగపడతాయని వీటిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తుల వివరాలను దరఖాస్తులు ఆన్లైన్ లో నమోదు చేస్తున్నారా? అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వివరాల నమోదులో ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. స్వీకరించిన దరఖాస్తులకు రసీదులు అందించాలని, సంబంధిత రిజిస్టర్లలో వివరాలు నమోదు చేయాలని సూచించారు. దరఖాస్తుల స్వీకరణ నమోదు రిజిస్టర్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. సమస్యల వారీగా అర్జీలను విభజిస్తూ, పక్కాగా రికార్డులను పొందుపర్చాలని అన్నారు. తహసీల్దార్ స్థాయిలో పరిష్కరించదగిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అన్నారు. ప్రజలు సమర్పించే ప్రతి దరఖాస్తును స్వీకరించాలని సూచించారు. ఒకవేళ సమస్యను పరిష్కరించేందుకు నిబంధనలు అంగీకరించని పక్షంలో దరఖాస్తుదారుడికి ఆ విషయాన్ని స్పష్టంగా అర్ధమయ్యే రీతిలో తెలియజేయాలని అన్నారు. సదస్సులో అర్జీలు అందించేందుకు వచ్చే వారితో సున్నితంగా వ్యవహరించాలని రెవెన్యూ సిబ్బందికి సూచించారు. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తూ, పూర్తి రికార్డుల ఆధారంగానే వాటిని పరిష్కరించాలని కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమం లో రెవెన్యూ డివిజినల్ అధికారి వాసు చంద్ర, తహసిల్దార్ లక్ష్మీనారాయణ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
Comment List