రూ.2125 కోట్ల పెట్టుబడులు
5020 మందికి ఉపాధి అవకాశం
* యూఏఈ కంపెనీలు శైవ గ్రూప్, టారనిస్ కేపిటల్ పెట్టుబడి
* రాష్ట్రానికి చెందిన అయిదు కంపెనీలతో అవగాహన ఒప్పందం
* రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడి
హైదరాబాద్, (లోకల్ గైడ్):
రాష్ట్రంలో యూఏఈకు చెందిన శైవ గ్రూప్, టారనిస్ కేపిటల్ సంయుక్తంగా రూ.2125 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చినట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. ఇందుకు రాష్ట్రానికి చెందిన అయిదు స్థానిక కంపెనీలతో.. ఈ రెండు సంస్థలు మంగళవారం డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో అవగాహన ఒప్పందం చేసుకున్నాయన్నారు. తద్వారా కొత్తగా మరో 5020 మంది తెలంగాణ యువతకు ఉపాధి లభిస్తుందని వివరించారు. ‘రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి... తెలంగాణ యువతకు ఉద్యోగాలు కల్పించాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం సంకల్పం’ అని ఈ సందర్భంగా సచివాలయంలో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో పేర్కొన్నారు. ‘18 నెలల్లో 60వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశాం. ఏడాదిన్నర కాలంలో రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులను తెలంగాణకు తీసుకొచ్చాం. ఫలితంగా ప్రైవేట్ రంగంలో లక్ష మందికి పైగా తెలంగాణ యువతకు ఉద్యోగాలు లభించాయి. ఈ ప్రయాణంలో ఈరోజు మరో గొప్ప అడుగు ముందుకేశాం’ అని అన్నారు. ‘అటు సంక్షేమం.. ఇటు అభివృద్ధిలో ఇతర రాష్ట్రాలకు ధీటుగా దూసుకెళ్తున్న తెలంగాణ పురోగతిలో భాగస్వామయ్యేందుకు ముందుకొచ్చిన యూఏఈకి చెందిన ప్రముఖ కంపెనీలు శైవ గ్రూప్(Shaiva Group), టారనిస్ కేపిటల్(Taranis Capital) ను ప్రభుత్వం తరఫున సాదరంగా ఆహ్వానిస్తున్నాం’ అని చెప్పారు. ‘శైవ గ్రూప్, టారనిస్ కేపిటల్ సంయుక్తంగా రివలేషన్స్ బయోటెక్ లో రూ.1360 కోట్లు, మనాకిన్ బయోలో రూ.340 కోట్లు, స్వబోధ ఇన్ఫినిటీ ఇన్వెస్ట్ మెంట్స్ అడ్వైజర్స్ లో రూ.80 కోట్లు, ఎగ్జిగెంట్ డ్రిల్లింగ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ రూ.90 కోట్లు, యంత్ర టెక్ కంట్రోల్స్ లో రూ.255 కోట్లు పెట్టుబడులు పెడుతున్నాయి’ అని చెప్పారు. ‘ఇది తొలి అడుగు మాత్రమే. రాబోయే మూడేళ్లలో బయోటెక్, ఏఐ, డేటా సెంటర్, డిఫెన్స్, ఎనర్జీ, ఫిన్ టెక్, పబ్లిక్ సెక్టార్స్ తదితర రంగాల్లో లో మరో రూ.24వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు శైవ గ్రూప్, టారనిస్ కేపిటల్ సంసిద్ధత వ్యక్తం చేశాయి’ అంటూ హర్షం వ్యక్తం చేశారు. ‘ఈ రెండు కంపెనీలు రాబోయే మూడేళ్లలో బయోటెక్ రంగంలో తినుబండారాల్లో చక్కెర శాతాన్ని తగ్గించడం, యాంటీ డయాబెటిక్, ఫుడ్ మేనేజ్ మెంట్ ఉత్పత్తులు, పబ్లిక్ సెక్టార్ లో ఫోర్త్ సిటీ, ఏఐ సిటీలో పెట్టుబడులు పెట్టనున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వంపై నమ్మకం ఉంచి... ‘తెలంగాణ రైజింగ్’లో భాగస్వామ్యమయ్యేందుకు ముందుకొచ్చిన వీరికి ప్రత్యేక ధన్యవాదాలు’ అని చెప్పారు. ‘కొందరు రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదు... పరిశ్రమలు తరలి వెళ్లిపోతున్నాయంటూ మా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి వారికి మేం తీసుకొస్తున్న పెట్టుబుడులు, కల్పిస్తున్న ఉద్యోగాలు కనిపించడం లేదా..? ఒక్కసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి’ అని కోరారు. ‘ఇక్కడి యువత ప్రతిభే మాకున్న పెద్ద ఆస్తి. డిగ్రీ, ఇంజినీరింగ్ పట్టా తీసుకుని బయటికొచ్చే విద్యార్థుల్లో పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు ఉండటం లేదనే ఫిర్యాదు పారిశ్రామికవేత్తల నుంచి తరచూ వస్తోంది. ఈ అంతరాన్ని తగ్గించేందుకే అంతర్జాతీయ ప్రమాణాలతో ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ని ఏర్పాటు చేశాం. మీ అందరి భాగస్వామ్యంతో కోర్సులకు రూపకల్పన చేసి.. మీకు కావాల్సిన మానవ వనరులను రెడీమేడ్ గా అందిస్తున్నాం. మీకు ఖర్చు, శ్రమ తగ్గిస్తున్నాం’ అని పారిశ్రామికవేత్తలకు వివరించారు. ‘తెలంగాణ ఒక రాష్ట్రం కాదు... అవకాశాల గని. ప్రతిభకు కేరాఫ్ అడ్రస్. కొత్త ఆలోచనలు, సృజనాత్మకత, ఆవిష్కరణలకు కేంద్రం. అంతర్జాతీయ భాగస్వామ్యాలకు గమ్యస్థానం. మీ ఎదుగుదలే... మా రాష్ట్రాభివృద్ధి అని నమ్మే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుంది. అందుకే తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలి’ వారిని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రాయ్ డిన్ రోచ్, శైవ గ్రూప్ ఛైర్మన్, సీఈవో అమిత్ జగన్నాథ్ వర్మ, టారనిస్ కేపిటల్ సీఈవో నికోలస్ ఎస్.బింగ్ హామ్, రివలేషన్స్ బయోటెక్ ఎండీ రవిచంద్ర బీరం, మనాకిన్ బయో డైరెక్టర్ జశ్వంత్ ప్రణవ్ యతిరాజాం, స్వబోధ ఇన్ఫినిటీ ఇన్వెస్ట్ మెంట్స్ అడ్వైజర్స్ సీఈవో సంకర్ష్ చందా, ఎగ్జిగెంట్ డ్రిల్లింగ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ పాండురంగా రావు తమ్మినేని, యంత్ర టెక్ కంట్రోల్స్ సీఈవో సమీర్ కాంత్ తదితరులు పాల్గొన్నారు.
Comment List