నిరుపేదలకే ఇందిరమ్మ ఇల్లు
ఇందిరమ్మ ఇళ్ల అర్హుల ఎంపికను త్వరగా పూర్తిచేయాలి
జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
లోకల్ గైడ్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిరుపేదల సొంతింటి కల సాకారం చేసేందుకు గాను ఇందిరమ్మ ఇళ్లను అందిస్తోందని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పేర్కొన్నారు.శనివారం, జిల్లాలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఇందిరమ్మ ఇళ్లపై అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పింకేష్ కుమార్ తో కలిసి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు, ఎంపిడిఓలు, పరిశీలన అధికారులతో గూగుల్ మీట్ ద్వారా ఆయా పురపాలికలు, మండలాల వారీగా ఎంత మేరకు పూర్తి చేశారో సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన ప్రక్రియలో భాగంగా జనగామ నియోజకవర్గంలో (13) మంది, ఘనపూర్ (స్టేషన్) నియోజకవర్గంలో (17) మంది, పాలకుర్తి నియోజకవర్గంలో (10) మంది పరిశీలన అధికారులు సర్వే చేస్తున్నారని తెలిపారు.
ఈ మేరకు లక్ష్యాల వారీగా నిర్దేశించుకొని అర్హుల ఎంపికను వేగవంతం చేసి, త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలనలో ఎక్కడా కూడా ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా క్షేత్రస్థాయిలో సజావుగా సర్వే చేయాలని, ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా..అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇల్లు అందేలా చూడాలని స్పష్టం చేశారు.అలాగే సర్వే చేసిన వివరాల పత్రాలను అత్యంత జాగ్రత్తగా భద్రపరచాలన్నారు. పరిశీలన చేసే క్రమంలో పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. ఎలాంటి నిర్లక్ష్యం తగదని, సర్వేను పక్కాగా నిర్వహించాలన్నారు. గ్రామాల వారీగా పరిశీలన పూర్తి కాగానే అర్హుల జాబితాను గ్రామ పంచాయతీ కార్యాలయంలోని నోటీసు బోర్డులో ప్రదర్శించాలని వెల్లడించారు.ఈ సమీక్షలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, గృహ నిర్మాణ పీడీ మాతృ నాయక్, మునిసిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఇతర సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Comment List