మన్యం వీరుడు అల్లూరి పోరాట స్ఫూర్తితో ఉద్యమిద్దాం
సిపిఐ ఎంఎఎల్ న్యూ డెమోక్రసీ
గద్వాల, లోకల్ గైడ్ :
మన్యం వీరుడు అల్లూరి పోరాట స్ఫూర్తితో ఉద్యమిద్దామని సిపిఐ ఎంఎఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు జమ్మిచెడు కార్తీక్ అన్నారు. మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు వందో వర్ధంతి సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని ఆయన విగ్రహం దగ్గర పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు జమ్మిచెడు కార్తీక్ మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర్య చరిత్రలో ఒక మహోజ్వల శక్తిగా ఎదిగిన అల్లూరి సీతారామరాజు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం అన్నారు. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడ న్నారు. కేవలం 27 ఏళ్ళ వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన అనుచరులతో, చాలా పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొన్నారని తెలిపారు. బ్రిటిష్ వారు మన దేశంలోని అన్ని వర్గాల ప్రజలను వేధించారన్నారు. ముఖ్యంగా గిరిజనుల హక్కులని కాల రాశారని, అల్లూరి సీతారామరాజు గిరిజనుల హక్కుల కోసం బ్రిటిష్ వారిని ఎదిరించారని తెలిపారు. అల్లూరి దాటికి తట్టుకోలేక బ్రిటిష్ వారు 1924 ఏప్రిల్ 17 న మన్యానికి కలెక్టరు (స్పెషల్ కమిషనర్)గా రూథర్ ఫర్డ్ ను నియమించారన్నారు. సీతారామరాజు ఆశించి కలలుగన్న స్వాతంత్య్రం ఆయన ఆత్మత్యాగం చేసిన 28 సంవత్సరాలకు ఆగస్టు 15, 1947న భారత ప్రజలకు స్వాతంత్రం వచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బీరెల్లి దానయ్య, రామకృష్ణ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comment List