విద్యార్థుల్లో స్థిరమైన జీవన విధానాలపై ఆసక్తిని పెంచాలి,
పర్యావరణ సమస్యలపై చర్చలను ప్రోత్సహించాలి,
నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ,
లోకల్ గైడ్ నాగర్ కర్నూల్ జిల్లా
విద్యార్థి దశ నుంచే ప్రతీ ఒక్కరూ పర్యావరణ పరిరక్షణపై పూర్తి స్థాయి అవగాహన పెంపొందించుకోవాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు.సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాతీయ విద్యార్థి పర్యావరణ క్విజ్ పోటీల నమోదు అవగాహన పోస్టర్లును అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవ సహాయం, డిఈఓ రమేష్ కుమార్ లతో కలిసి జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ....... నాగర్ కర్నూల్ జిల్లాలో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ, విద్యా మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు విద్యార్థులకు అన్ని యాజమాన్య పాఠశాలల్లో ‘హరిత్- జీవన మార్గం’ నినాదంతో జాతీయ విద్యార్థి పర్యావరణ క్విజ్ పోటీలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ పోటీలు రూపొందించబడ్డాయని, విద్యార్థుల్లో స్థిరమైన జీవన విధానాలపై ఆసక్తిని పెంచడం, పర్యావరణ సమస్యలపై చర్చను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశమని, ఈ క్విజ్ పోటీలు మొక్కలు నాటడం, వ్యర్థాలను వేరు చేయడం, నీటి సంరక్షణ వంటి కీలక అంశాలపై దృష్టి సారిస్తాయని కలెక్టర్ బాదావత్ సంతోష్ వెల్లడించారు.
పాఠశాలలు, కళాశాలలు, విద్యాలయాల్లో చదివే విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనేందుకు అర్హులని, ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు పర్యావరణ సమస్యలపై లోతైన అవగాహన పొందడమే కాకుండా, సమాజంలో సానుకూల మార్పులకు దోహదపడే విధంగా ప్రేరణ పొందుతారని కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. పోటీల్లో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులు జూలై 1వ తేదీ నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు నమోదు కార్యక్రమాలను పూర్తి చేయించాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలలు, కళాశాలలు, విద్యాలయాల నిర్వాహకులు తమ విద్యార్థులను ఈ పోటీల్లో చురుగ్గా పాల్గొనేలా ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఈ క్విజ్ పోటీలు విద్యార్థులకు తమ జ్ఞానాన్ని పరీక్షించుకునే అవకాశంతో పాటు, హరిత భవిష్యత్తు నిర్మాణంలో భాగస్వాదులవ్వే మార్గాన్ని సుగమం చేస్తాయని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. ఇతర సమగ్ర సమాచారానికి జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయ జిల్లా సైన్స్ అధికారిని రాజశేఖర్ రావు 63025- 38858 నెంబర్ను సంప్రదించాలని కలెక్టర్ సందర్భంగా కోరారు.
ఈ కార్యక్రమంలో డీఈఓ రమేష్ కుమార్, కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్, జిల్లా సైన్స్ అధికారి రాజశేఖర్ రావు తదితరులు పాల్గొన్నారు.