ఉత్తరాదిలో వరద బీభత్సం:
హిమాచల్ ప్రదేశ్లో ఐదుగురు మృతి
దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు, వరదలు తీవ్ర స్థాయిలో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో వరద బీభత్సం సృష్టించింది. హిమాచల్ ప్రదేశ్లో ఆకస్మిక వరదలు (Flash Floods) సంభవించాయి.కాంగ్రా, కులు జిల్లాల్లో చోటుచేసుకున్న ఈ వరదల్లో ఇప్పటి వరకు ఐదుగురు మృతి చెందారు. ధర్మశాలా ప్రాంతాలు కూడా వరదలతో ముంపునకు గురయ్యాయి. ఈ ఆకస్మిక వరదల్లో పలువురు కొట్టుకుపోయినట్లు కాంగ్రా పోలీస్ సూపరింటెండెంట్ షాలిని అగ్నిహోత్రి తెలిపారు.ఎస్డీఆర్ఎఫ్, స్థానిక పోలీసులు, హోం గార్డ్స్ రంగంలోకి దిగాయి. ఇప్పటివరకు సుమారు 250 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు.“కొంతమంది వరదల్లో కొట్టుకుపోయారు. ఎస్డీఆర్ఎఫ్, స్థానిక పోలీసులు, హిమాచల్ హోం గార్డ్స్ సోదరుల సహకారంతో సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. నిన్న రెండు మృతదేహాలను, ఇవాళ మూడు మృతదేహాలను వెలికితీశాం. ఇంకా గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి,” అని షాలిని అగ్నిహోత్రి వివరించారు.