అహ్మదాబాద్ విమాన ప్రమాదం – బ్లాక్ బాక్స్ డేటా విశ్లేషణలో కేంద్రం
లోకల్ గైడ్ : అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. ఇటీవల కూలిన ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించిన బ్లాక్ బాక్స్లను అధికారులు విజయవంతంగా రికవర్ చేసి, వాటిలోని డేటాను ఢిల్లీలోని విమాన ప్రమాదాల దర్యాప్తు బ్యూరో (AAIB) ల్యాబ్కు తరలించారు.ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, కాక్పిట్ వాయిస్ రికార్డర్ (CVR) మరియు ఫ్లైట్ డేటా రికార్డర్ (FDR) నుంచి డేటా డౌన్లోడ్ చేసి, పూర్తిస్థాయి విశ్లేషణ చేపట్టారు. ముందు భాగంలో ఉన్న బ్లాక్ బాక్స్ నుంచి క్రాష్ ప్రొటెక్షన్ మాడ్యూల్ను సురక్షితంగా రికవర్ చేసినట్టు, అలాగే మెమోరీ మాడ్యూల్ను సజీవంగా బయటకు తీశామని అధికారులు తెలిపారు.విమాన దుర్ఘటనకు గల కారణాలను ఖచ్చితంగా గుర్తించేందుకు, ఈ CVR, FDR డేటా కీలకంగా ఉండనుందని కేంద్ర సివిల్ ఏవియేషన్ శాఖ వెల్లడించింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఈ విశ్లేషణల ద్వారా తేలనున్నాయి.అహ్మదాబాద్ నగరంలో ఒక ఇంటి పైకప్పు నుంచి బ్లాక్ బాక్సులు రికవర్ చేసినట్టు అధికారులు తెలిపారు. CVRను జూన్ 13న, FDRను జూన్ 16న వెలికితీసినట్టు వివరించారు. వీటిని పోలీసుల భద్రత మధ్య, CCTV నిఘాలో ఉంచి జూన్ 24న ఢిల్లీకి తరలించారు.ప్రస్తుతం ఫ్రంట్, రియర్ బ్లాక్ బాక్సులు AAIB ల్యాబ్లో ఉండగా, వాటి ఆధారంగా సమగ్రంగా ప్రమాదానికి గల కారణాలు వెల్లడి అయ్యే అవకాశముంది. AAIB అధికారులు ఈ దర్యాప్తును తుది అంచనా దాకా తీసుకెళ్లేందుకు చర్యలు ముమ్మరం చేశారు.