యోగాను జీవన విధానం గా మార్చుకోవాలి
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి.
నల్లగొండ (లోకల్ గైడ్).
యోగాను జీవన విధానంగా మార్చుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు.11 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలోని రామగిరి లో ఉన్న ఎం.వి.ఆర్ కాన్సెప్ట్ పాఠశాలలో ఆయుష్ శాఖ, జిల్లా క్రీడల అభివృద్ధి శాఖ, పతంజలి యోగ సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన యోగా దినోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై యోగాసనాలు వేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ యోగా ద్వారా శారీరక, మానసిక స్థిరత్వాన్ని సాధించవచ్చని, దీనికి తోడుగా సాత్విక ఆహారం, మంచి అలవాట్లతో అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చని అన్నారు. యోగ వల్ల ఆరోగ్యంతో పాటు, పనిపై శ్రద్ధ కలుగుతుందని, జిల్లా యంత్రాంగం తరఫున అధికారులు, సిబ్బందికి యోగా తరగతులు ఏర్పాటు చేస్తామని తెలిపారు.ప్రతి ఒక్కరు అల్పాహారం, జ్ఞానం , శారీరక శ్రమతో పాటు, మానసిక ప్రశాంతత అలవాటు చేసుకోవాలని, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా పని చేసినట్లయితే అనుకున్న లక్ష్యాలను సులభంగా సాధించవచ్చని అన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్ మాట్లాడుతూ యోగా ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చని అన్నారు. ప్రతినిత్యం వత్తిడులతో గడిపే ఉద్యోగులకు యోగ తప్పనిసరి అని, దీని ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చని అన్నారు .జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ ,తదితరులు మాట్లాడారు .ఈ సందర్భంగా విద్యార్థులు యోగ విన్యాసాలను ప్రదర్శించగా, కొంతమంది చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు.అనంతరం జిల్లా కలెక్టర్ యోగా గురువులకు సన్మానం చేసి ప్రశంస పత్రాలను అందజేశారు.ఆర్డీవో అశోక్ రెడ్డి,ఇంచార్జ్ సి ఈ ఓ శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.