అంతర్జాతీయ యాంటీ డ్రగ్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా మాదక ద్రవ్యాల నిర్మూలనపై విద్యార్థినీ, విద్యార్థులకు అవగాహన కార్యక్రమం.
యువత మాదక ద్రవ్యాల నిర్మూలనలో ప్రతి ఒక్కరు యాంటీ డ్రగ్ సోల్జర్గా పనిచేయాలి.
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ .
అంతర్జాతీయ యాంటీ డ్రగ్ అవగాహన వారోత్సవాలలో భాగంగా నల్గొండ పట్టణంలోని చిన్న వెంకట్ రెడ్డి పంక్షన్ హాల్లో మాదక ద్రవ్యాలకు యువత బానిసై జీవితాలను కోల్పోతున్న తరుణంలో మాదక ద్రవ్యాలను తీసుకోవడం వల్ల జరిగే నష్టాలు, వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివిధ కళాశాలల విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, యువత తమ శక్తియుక్తులను డ్రగ్స్ మాయలో పడి వృథా చేసుకోకూడదని, ఒక్కసారి డ్రగ్స్ వాడితే అది మెల్లమెల్లగా వ్యసనంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సంతోషం కొరకు సేవించడం అలవాటుగా పడి డ్రగ్స్ బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని అన్నారు. కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని తెలిపారు. డ్రగ్స్ మీద పోలీసులు చేస్తున్న పోరాటంలో యువత పాలుపంచుకోవాలని, డ్రగ్స్ వినియోగానికి దూరంగా ఉండడంతో పాటు, తమ దృష్టికి నిషేధిత డ్రగ్స్ సరఫరా మరియు వినియోగానికి సంబంధించిన సమాచారాన్ని తక్షణమే తెలియజేయాలని సూచించారు.
నిషేధిత డ్రగ్స్ వాడకం వలన అనేక నేరాలకు పాల్పడుతూ కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయని పేర్కొన్నారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం యువత యాంటీ డ్రగ్ సోల్జర్గా పని చేయాలని పిలుపునిచ్చారు. నిషేధిత మత్తుపదార్థాల వాడకం అనేది సమాజానికి పట్టిన చీడపురుగు వంటిదని, డ్రగ్స్ వినియోగాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాలని, తెలిసీ తెలియక మత్తుపదార్థాల బారిన పడడం వల్ల యువత బంగారు భవిష్యత్తు నాశనం అవుతోందని, యువత యొక్క శారీరక, మానసిక ఆరోగ్య విచ్ఛిన్నం కావడంతో పాటు, ఆర్థిక సమస్యలతో పాటు సమాజంలో గౌరవం లేకుండా పోతుందని అన్నారు. యువత ఒక్కసారి డ్రగ్స్ సేవించి పట్టుబడి కేసు నమోదు అయితే భవిష్యత్తులో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలకు మరియు ఏ ఇతర దేశాలకు కూడా వెళ్ళే అవకాశం దొరకక జీవితం అంధకారంలోకి వెళ్తుందని తెలియజేశారు. ఎవరైనా గంజాయి డ్రగ్స్ సేవిస్తే NDPS చట్టం-1985 తో పాటు ఇతర చట్టాల ప్రకారం కఠిన కేసులు నమోదు చేయడం జరిగిందని పేర్కొన్నారు. జిల్లాలో గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు సమాచారం తెలిస్తే, టోల్ ఫ్రీ నెంబర్ 8712670266 కు సమాచారం తెలపాలని కోరారు.అనంతరం నేను మాదక ద్రవ్యాల నిరోధకపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, టూ టౌన్ సిఐ రాఘవరావు, వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, 2 టౌన్ ఎస్సై సైదులు, వివిధ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.