ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాల్సిందే.. లేదంటే మేమే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం... కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి...
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి: (లోకల్ గైడ్)
దేశంలోనే సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాల్సిందేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఫోన్ ట్యాపింగ్ కేసు పై చిత్తశుద్ధి ఉంటే సెంట్రల్ బ్యూరోకు అప్పగించాలని లేదంటే తామే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎమర్జెన్సీ పై జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ అయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా ప్రతినిధులతో పాటు న్యాయమూర్తులు, పత్రిక ఎడిటర్లు, విలేకరులతో పాటు సినీ నటులకు చెందిన ఫోన్లను సైతం ట్యాపింగ్ చేయడం చాలా దురదృష్టకరమన్నారు. కాంగ్రెస్ పార్టీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించకుంటే బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వస్తుందని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కయ్యారన్న అపవాదు ప్రజల్లో కలగకూడదంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సీబీఐ కి అప్పగించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని, దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు నరేంద్ర మోడీ కి విన్నవించిన నిజామాబాద్ జిల్లా రైతుల సంక్షేమానికి జిల్లాలో ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయం అన్నారు. దేశంలో మోడీ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పాటుపడుతుందని, నిజామాబాద్ జిల్లాలో పసుపు రైతులు ఎక్కువగా ఉన్నందుకు పసుపు కేంద్ర కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పసుపు బోర్డ్ కేంద్రాన్ని ఈనెల 29న హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించనున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా సీనియర్ రాజకీయ నేత ధర్మపురి శ్రీనివాస్ ప్రథమ వర్ధంతి సందర్భంగా కంటేశ్వర్ బైపాస్ రోడ్ లో ఏర్పాటుచేసిన డిఎస్ విగ్రహాన్ని ప్రారంభించనున్నట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు.ఈ విలేకరుల సమావేశంలో అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా,పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, శాసనమండలి సభ్యులు అంజిరెడ్డి,జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి, స్రవంతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.