గీతంలో ఉత్సాహంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
చురుకుగా పాల్గొన్న విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది
పఠాన్ చేరు, (లోకల్ గైడ్ ప్రతినిధి): పఠాన్ చేరు హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో శనివారం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ‘ఒక భూమి కోసం యోగా, ఒక ఆరోగ్యం’ ఇతివృత్తంలో స్పోర్ట్స్ డైరెక్టరేట్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది చురుకుగా పాల్గొన్నారు. యోగా సాధన ద్వారా సమగ్ర శ్రేయస్సు, పర్యావరణ స్పృహను ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ వేడుక సాగింది.శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో యోగా భ్యాసాల ప్రాముఖ్యతను నిపుణుడైన యోగా బోధకుడు పరిచయం చేయడంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఆ తరువాత భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచించిన సాధారణ యోగా ప్రోటోకాల్ ప్రకారం కార్యక్రమాన్ని కొనసాగించారు. యోగాసనాలు, కపాలభాతి, ప్రాణాయామం, ధ్యానం వంటివి సాధన చేశారు. క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం వల్ల పని ప్రదేశంలో ఒత్తిడి గణనీయంగా తగ్గుతుందని, సమగ్ర శ్రేయస్సును ఎలా పెంచుతుందో బోధకుడు వివరించారు. శాంతి ప్రార్థనతో ఈ యోగ సాధన కార్యక్రమం ముగిసింది. గీతం హైదరాబాదు అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, ఆతిథ్య విభాగం-క్యాంపస్ లైఫ్ డైరెక్టర్ అంబికా ఫిలిప్, పలువురు విభాగాధిపతులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం పురాతన క్రమశిక్షణను స్వీకరించడం లోని ఔచిత్యాన్ని వారు ఆచరణ రూపంలో చాటిచెప్పారు.