మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన సదస్సు
-భాగంగా గీతంలో మొక్కలు నాటిన డీఎస్పీ, సీఐ
పఠాన్ చేరు, (లోకల్ గైడ్ ప్రతినిధి): పర్యావరణ స్పృహను పెంపొందించడంతో పాటు మాదకద్రవ్యాల దుర్వినియోగ ప్రమాదాల గురించి అవగాహన పెంచడంలో భాగంగా పఠాన్ చేరు పోలీసు విభాగం సోమవారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో మొక్కలు నాటారు. డీఎస్పీ ఎస్. ప్రభాకర్, పఠాన్ చేరు సర్కిల్ ఇన్ స్పెక్టర్ వినాయకరెడ్డిల నేతృత్వంలో, దాదాపు 30 మంది పోలీసు సిబ్బంది గీతం ప్రాంగణంలో మొక్కలు నాటారు. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన, మాదకద్రవ్య రహిత సమాజాన్ని సూచిస్తూ రాష్ట్ర హరితీకరణకు దోహదపడటం లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగింది. ఈ సందర్భంగా డీఎస్పీ ప్రభాకర్ మాట్లాడుతూ..మాదకద్రవ్య దుర్వినియోగం యొక్క తీవ్రమైన పరిణామాలను ప్రస్తావిస్తూ, మాదకద్రవ్య, సైకోట్రోపిక్ పదార్థాల హానికరమైన ప్రభావాలను వివరించారు. విద్యార్థులు, యువత అప్రమత్తంగా, బాధ్యతాయుతంగా ఉండాలని, మాదకద్రవ్య రహిత దేశాన్ని నిర్మించడానికి కట్టుబడి ఉంటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గీతం నాయకత్వం కూడా చురుకుగా పాల్గొంది. గీతం, హైదరాబాదు రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, ఈఈసీఈ విభాగం అధ్యాపకులు ప్రొఫెసర్ కె.మంజునాథాచారి, ప్రొఫెసర్ పి.త్రినాథరావు, ఎస్టేట్ అధికారి డీవీఏ మోహన్ తదితరులు ఉన్నారు. పర్యావరణ, సామాజిక సమస్యలను పరిష్కరించడం లో చట్ట అమలు సంస్థలు, విద్యా సంస్థలు, సమాజం మధ్య భాగస్వామ్య బాధ్యతగా ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు.