బాలీవుడ్లో బయోపిక్ల జోరు....
ఇలాంటి పరిస్థితుల్లో మరో ఆసక్తికర బయోపిక్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దివంగత నటీమణి, ‘ట్రాజెడీ క్వీన్’గా ప్రసిద్ధి చెందిన మీనా కుమారి జీవితకథ ఆధారంగా ఈ బయోపిక్ రూపొందనుందని సమాచారం. ఈ సినిమాలో కియారా అద్వాణీ మీనా కుమారి పాత్రను పోషించబోతున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.‘బైజు బావరా’, ‘పాకీజా’ వంటి అద్భుతమైన సినిమాలతో భారతీయ సినీ చరిత్రలో చెరగని గుర్తింపు పొందిన మీనా కుమారి గురించి సినీ అభిమానులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆమె జీవితం భావోద్వేగాలు, వ్యక్తిగత సమస్యలు, ప్రేమ, కీర్తి… అన్నీ కలగలిసి వెండితెరపై మరోసారి వ్యక్తమయ్యేలా బాలీవుడ్ ముహూర్తం పెట్టుకున్నట్లు సమాచారం.ఈ ప్రతిష్టాత్మక బయోపిక్ను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా స్వయంగా నిర్మించి, దర్శకత్వం వహించబోతున్నారని తెలుస్తోంది. ఫ్యాషన్ రంగంలో తనదైన ముద్ర వేసిన మనీష్, ఈ సినిమాతో దర్శకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించనున్నాడు. అందులోనూ తొలి ప్రయత్నమే మీనా కుమారి బయోపిక్ కావడం విశేషం.తాజా సమాచారం ప్రకారం, ఈ కీర్తివంతమైన పాత్రకు చాలా మంది హీరోయిన్లు ఆసక్తి చూపినా, అవసరమైన భావోద్వేగం, ఆత్మీయత కియారా నుంచే లభిస్తుందనే నమ్మకం చిత్ర బృందానికి ఉందట. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఈ బయోపిక్ గురించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని కియారా సన్నిహితులు చెబుతున్నారు.