ప్రారంభమైన పూరీ జగన్నాథుని రథయాత్ర .....
లోకల్ గైడ్: ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పూరీ జగన్నాథుని రథయాత్ర ఘనంగా ప్రారంభమైంది. ప్రతి ఏడాది ఆషాఢ శుద్ధ విదియ నాడు జరిగే ఈ రథయాత్రను వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పూరీకి చేరుకుంటారు. దీంతో పూరీ క్షేత్రం మొత్తం భక్తులతో కిక్కిరిసిపోయింది.వేలాది మంది భక్తులు “జై జగన్నాథ్”, “హరిబోల్” నినాదాలతో రథం వెంట నడుస్తూ భక్తిశ్రద్ధలతో ముందుకు సాగుతున్నారు. ఈ వేడుకలో సుమారు 12 లక్షల మంది భక్తులు పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్లుగా భద్రతా ఏర్పాట్లను విస్తృతంగా నిర్వహించారు.ఒడిశా ప్రభుత్వం ఈసారి ప్రత్యేకంగా 275 ఏఐ కెమెరాలు, డ్రోన్లు ఏర్పాటు చేసి రద్దీని నియంత్రిస్తోంది. 12 రోజుల పాటు కొనసాగనున్న ఈ యాత్ర కోసం దేవస్థానం రెండు నెలల కిందట నుంచే ఏర్పాట్లు ప్రారంభించింది.సాధారణంగా హిందూ ఆలయాల్లో ఉత్సవ మూర్తులను ఊరేగిస్తారు. కానీ పూరీలో భిన్నంగా, మూల విరాట్ స్వయంగా గర్భగుడి నుంచి బయటకు తీసుకువస్తారు. ప్రతి ఏడాది కొత్త రథాలను తయారు చేస్తారు. రాజు బంగారు చీపురుతో రథ మార్గాన్ని శుభ్రం చేసి, యాత్రను ప్రారంభిస్తారు.లక్షలాది మంది భక్తులు రథాన్ని లాగుతూ తమ భక్తిని చాటుతారు. జగన్నాథుడు, బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి పెంచిన తల్లి గుండిచా ఆలయానికి చేరుకుని వారం రోజుల పాటు అక్కడ విశ్రాంతి తీసుకొని తిరిగి ఆలయానికి వస్తారు. ఈ యాత్రను కళ్లారా చూడటం భక్తులు జీవితంలో అదృష్టంగా భావిస్తారు.