యశస్వీ జోరుకు బ్రాడ్మన్ రికార్డు చెరిగింది.. ధోనీని దాటేసిన పంత్!
ఇంగ్లండ్ పర్యటనలో భారత యువ క్రికెటర్లు రికార్డుల వేటలో దుమ్మురేపుతున్నారు. హెడింగ్లే టెస్టులో యశస్వీ జైస్వాల్ తన శతకంతో దూకుడుగా ఆడి, లెజెండ్ సర్ డాన్ బ్రాడ్మన్ రికార్డును చెరిగాడు. ఈ ఏడాది ఆరంభంలో విశాఖపట్నం టెస్టులో ఇంగ్లండ్పై డబుల్ సెంచరీ కొట్టిన యశస్వీ, ఈసారి వారి మైదానంలోనే శతకం బాదాడు.మ్యాచ్లో అర్ధశతకంతో ఆకట్టుకున్న వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ కూడా సరికొత్త రికార్డు రాసుకున్నాడు. సేనా దేశాలు (దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా)పై అత్యధిక సగటు సాధించిన వికెట్ కీపర్గా ఎంఎస్ ధోనీని వెనక్కి నెట్టాడు.సీనియర్ ప్లేయర్ల వీడ్కోలు తర్వాత యువతరం ఘన ప్రదర్శన ఇస్తోంది. యశస్వీ తన ఫుట్వర్క్, టెక్నిక్తో క్రీజులో నిలదొక్కుకుని 101 పరుగులు సాధించాడు. ఈ ఇన్నింగ్స్తో కలిపి అతను ఇంగ్లండ్పై 10 ఇన్నింగ్స్ల్లో 813 పరుగులు సాధించాడు. ప్రస్తుతం అతడి సగటు 90.33. డాన్ బ్రాడ్మన్ ఇంగ్లండ్పై 63 ఇన్నింగ్స్ల్లో 5,028 పరుగులు చేసి 89.78 సగటుతో ఉన్నాడు. దాంతో బ్రాడ్మన్ను అధిగమించి యశస్వీ కొత్త రికార్డు సృష్టించాడు.లంచ్ తర్వాత యశస్వీ ఔటైన తర్వాత పంత్ క్రీజులోకి వచ్చి తనదైన స్టైల్లో షాట్లు ఆడాడు. కెప్టెన్ శుభ్మన్ గిల్ (127 నాటౌట్) సెంచరీ తర్వాత పంత్ వోక్స్, టంగ్ బౌలింగ్లను ధాటిగా ఎదుర్కొని బౌండరీలతో రన్ రేట్ పెంచాడు. ఆట ముగిసే సరికి 65 పరుగులతో నాటౌట్గా నిలిచిన పంత్ సేనా దేశాల్లో 38.80 సగటును నమోదు చేసి ధోనీ రికార్డును తిరగరాశాడు.