పది మంది యాత్రికుల ఆచూకీ గల్లంతు
లోకల్ గైడ్: డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లాలో విషాదకర ఘటన జరిగింది. భక్తులతో వెళ్తున్న ఓ టెంపో ట్రావెలర్ వాహనం అలనకంద నదిలో పడిపోవడంతో ఇద్దరు యాత్రికులు మృతి చెందారు. మరో ఎనిమిది మంది గాయపడగా, పది మంది ఇప్పటికీ అదృశ్యమయ్యారు.ఈ ఘటన రుద్రప్రయాగ్ – గౌచార్ మార్గంలో ఉన్న బద్రీనాథ్ జాతీయ రహదారిపై గోల్తిర్ గ్రామం వద్ద ఉదయం 7:30 గంటల సమయంలో చోటు చేసుకుంది
. వాహనంలో డ్రైవర్తో సహా మొత్తం 20 మంది యాత్రికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారు అంతా రాజస్థాన్లోని ఉదయ్పూర్ నుంచి చార్ధామ్ యాత్రకు వచ్చిన భక్తులు.ప్రమాదం సమాచారం తెలుసుకున్న వెంటనే రిలీఫ్, రెస్క్యూ బృందాలు ఘటన స్థలానికి చేరుకున్నాయి. ఇప్పటివరకు రెండు మృతదేహాలను నదిలో నుంచి వెలికితీశారు. ఒక మృతదేహాన్ని రుద్రప్రయాగ్ సమీపంలో గుర్తించారు. గాయపడినవారిలో మహిళలు, చిన్నపిల్లలు కూడా ఉన్నట్లు రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధి సత్యేంద్ర సింగ్ భండారి తెలిపారు.ప్రస్తుతం నదిలో మిగిలిన వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలం వర్షాల వల్ల జారుడు నేలగా ఉండటంతో రెస్క్యూ ఆపరేషన్కు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. బాధితులకు అత్యవసర చికిత్స అందించేందుకు సమీప ఆసుపత్రుల్లో ఏర్పాట్లు చేశారు.