ఎస్సీవో డిక్లరేషన్పై సంతకం చేయని రాజ్నాథ్ సింగ్
లోకల్ గైడ్ :క్వింగ్డావో (చైనా): షాంఘై సహకార సంస్థ (SCO) సమావేశాల్లో రూపొందించిన సంయుక్త ప్రకటనపై భారత్ సంతకం చేయకుండా పక్కనపెట్టింది. ఈ ప్రకటనలో పెహల్గామ్ ఉగ్రదాడిపై ఎలాంటి ప్రస్తావన లేకపోవడం వల్లే, భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఉగ్రవాదం అంశంపై జరిగిన చర్చల అనంతరం జాయింట్ డిక్లరేషన్ ముసాయిదా సమర్పించగా, భారత్ తమ అభిప్రాయాలు సరిగా ప్రతిబింబించలేదని అభ్యంతరం తెలిపింది. పెహల్గామ్ దాడి విషయాన్ని ఉద్దేశపూర్వకంగా ఎస్సీఓ డాక్యుమెంట్ నుంచి తొలగించడం పట్ల భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో భారత్ ఆ సంయుక్త ప్రకటనపై సంతకం చేయకుండానే దూరంగా నిలిచింది.భారత ప్రభుత్వం ఇప్పటికే పెహల్గామ్ ఉగ్రదాడికి పాకిస్థాన్కు సంబంధం ఉందని ఆరోపిస్తూ, దీనిపై అంతర్జాతీయంగా దృష్టి సారించాలని కోరుతోంది.అదే సమయంలో SCO డిక్లరేషన్లో మాత్రం బలూచిస్తాన్లో జరిగిన ఉగ్రదాడి, అలాగే మార్చిలో హైజాక్కు గురైన జాఫర్ ఎక్స్ప్రెస్ ఘటనను ఖండిస్తూ ప్రస్తావనలుంటే, పెహల్గామ్ దాడి విషయంలో మౌనం పాటించడం భారత అధికారుల అసంతృప్తికి దారి తీసింది.భారత బృందం తమ అభిప్రాయాలను తీవ్రంగా వ్యక్తం చేయడంతో, చివరకు ఆ డిక్లరేషన్ను నిలిపివేయాల్సి వచ్చిందని సమాచారం.