పేట ప్రజల్లో తన ముద్ర వేసుకున్న కలెక్టర్ పట్నాయక్
_విధుల పట్ల నిబద్ధత.. చేసే ప్రతి పనిలో పారదర్శకత.. _ప్రజలకు అందుబాటులో ఉండటమే ఆమె దినచర్య.. _ప్రజా సమస్యల పరిష్కారం పట్ల నిర్లక్ష్యం చేస్తే అధికారులపై ఉంటుంది కఠిన చర్య..
_పకడ్బందీగా ప్రభుత్వ పథకాల అమలు చేయడంలో ఆమెది అందెవేసిన చేయి...
_పాలనలో తనదో ప్రత్యేక శైలి.
తాను ఎక్కడ పనిచేసినా ప్రజల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకుని ఉత్తమ సేవలు అందిస్తున్న సిక్త పట్నాయక్ IAS ఈ నెల 16 వ తేదీ నాటికి నారాయణపేట జిల్లా కలెక్టర్ గా ఉద్యోగ బాధ్యతలు చేపట్టి ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా సిక్త పట్నాయక్ IAS పై స్పెషల్ స్టోరీ.*
లోకల్ గైడ్:
పేద ప్రజల విద్య, వైద్యం, సంక్షేమం, అభివృద్ధి, పై ప్రత్యేక శ్రద్ధ పెడుతూనే... ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా, పకడ్బందీగా సమర్థవంతమైన పాలనను నారాయణపేట జిల్లా ప్రజలకు అందిస్తున్నారు. సహజ వనరుల అక్రమ తరలింపునకు అడ్డుకట్ట వేస్తూ అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టిస్తున్నారు... అన్ని రంగాలపై దృష్టి సారిస్తూ పాలనలో తనదైన ముద్ర వేస్తున్న నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ ఏడాది పాలన పై స్పెషల్ ఫోకస్..
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ... లక్ష్యం వైపు స్పష్టత ఇస్తూ... జిల్లాలో పాలనా బాధ్యతలు స్వీకరించిన వెంటనే విద్య, వైద్య వ్యవస్థల పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు.
ప్రభుత్వ విద్య సంస్థలను ఆకస్మిక తనిఖీ చేస్తూ... పాఠాలు బోధిస్తూ...
జిల్లా కలెక్టర్ వివిధ ప్రభుత్వ విద్య సంస్థలను ఆకస్మిక తనిఖీ చేస్తూ... పాఠాలు బోధిస్తూ... విద్యాలయాల్లో వసతులు పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సైన్సు, మ్యాథ్స్, ఇంగ్లీష్ తదితర పాఠాలు బోధిస్తూ.. వారిని వివిధ ప్రశ్నలు అడుగుతూ ప్రోత్సహిస్తున్నారు. లక్ష్యం వైపు స్పష్టతను ఇస్తూ భవిష్యత్ ప్రణాళికపై మార్గదర్శిగా నిలుస్తున్నారు. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటుచేసిన అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా జిల్లాలోని వివిధ పాఠశాలలలో విద్యార్థులకు అవసరమైన మౌలిక వస్తువుల కల్పనకు నిధులను మంజూరు చేశారు. జిల్లాలో అదనపు తరగతి గదిలో నిర్మాణాలు, కొత్త మండలాలలో జూనియర్ కళాశాల నిర్మాణాలను వేగిరం చేయిస్తున్నారు.
విద్యార్థుల విద్యా బోధన పై ప్రత్యేక శ్రద్ధ....
పదో తరగతి విద్యార్థులపై శ్రద్ధ పెట్టి ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులతో తరగతులు నిర్వహించారు. ప్రత్యేకంగా వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించి వారిని కనీస ఉత్తీర్ణత శాతం సాధించేలా ఉపాధ్యాయులకు సూచనలు చేస్తున్నారు. ఏటేటా పది ఫలితాలు మెరుగుపడేందుకు అవసరమైన ముందస్తు ప్రణాళికలు రచించి విద్యాశాఖను సమాయత్తం చేస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలలో అధునాతన సౌకర్యాలు కల్పిస్తూ...
జిల్లాలోని 486 ప్రభుత్వ పాఠశాలల్లో ఐసీటీ ల్యాబ్ సౌకర్యం కల్పిస్తూ డిజిటల్ మాధ్యమంలో బోధనను అందిస్తున్నది. ఆయా విద్య సంస్థల్లో ఉన్నత విద్య ప్రమాణాలు కొనసాగేలా ఔట్ సోర్సింగ్ కింద టీచర్ల నియామకానికి అభ్యర్థులను కలెక్టర్ స్వయంగా ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేశారు. దృష్టి లోపం ఉన్న విద్యార్థులకు కంటి, దంత పరీక్షలు నిర్వహణ అవసరమైన వారికి దంత చికిత్స, కంటి అద్దాలు పంపిణీ చేయించారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు భవిత కేంద్రాలను నిర్వహిస్తున్నారు.
స్త్రీ, శిశు, వృద్ధుల సంక్షేమానికి పటిష్ట చర్యలు... పేద విద్యార్థులకు ఆర్థిక భరోసా...
అంగన్వాడి కేంద్రాలను తనిఖీ చేస్తూ పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. కుటుంబంలో నిరాదరణకు గురైన వృద్ధులకు, తల్లితండ్రులు లేని అనాథలకు నారాయణపేట జిల్లా కేంద్రంలోని అనాథ మరియు వృద్ధాశ్రమంలో ఆశ్రయాన్ని కల్పిస్తున్నారు.అనాథ పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలలకు పంపించి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. క్రమం తప్పకుండా అనాథ ఆశ్రమాన్ని సందర్శించి అక్కడి చిన్నారులతో ముచ్చటించి, మీ అందరికీ మేము ఉన్నామనే భరోసా కల్పిస్తున్నారు.
కొండాపూర్ ధన్వాడ మండలం కొండాపూర్ గ్రామంలో గల ట్రైబల్ వెల్ఫేర్ అప్ గ్రెడెడ్ పాఠశాల, జూనియర్ కళాశాలలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీల దినోత్సవ వేడుకలకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరై పీఎం శ్రీ కింద మన కొండపూర్ ట్రైబల్ వెల్ఫేర్ అప్ గ్రెడెడ్ పాఠశాల ఎంపిక కావడం ఎంతో సంతోషంగా ఉందని అభినందించి, రూ. లక్షల విలువ గల ల్యాబ్ ట్యాప్ లను అందజేశారు.
ప్రభుత్వ వైద్య సేవలపై ఫోన్ లో ఆరా...
జిల్లా కేంద్ర దవాఖాన, మక్తల్ ఏరియా దవాఖాన, అన్ని మండలాల్లోని పీహెచ్సీలు, సీహెచ్సీలు క్రమం తప్పకుండా ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నారు. ఆసుపత్రి ఆవరణ, లోపల పారిశుధ్య చర్యలు, మందులు, వ్యాక్సిన్ల నిల్వలు, ఓపీ, ఇన్ పేషెంట్ వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న సేవలు తెలుసుకొని వారితో కలెక్టర్ సెల్ ఫోన్లో మాట్లాడి, వైద్యం అందిస్తున్న తీరు, మందుల పంపిణీపై ఆరా తీస్తున్నారు. ఆయా దవాఖానల్లో ఉన్నత విద్య ప్రమాణాలు కొనసాగేలా కాంట్రాక్టు కింద డాక్టర్లు, వైద్య సిబ్బంది నియామకానికి అభ్యర్థులను కలెక్టర్ స్వయంగా ఇంటర్వ్యూ చేసి అర్హులను ఎంపిక చేశారు.
ప్రత్యేక చొరవతో...ప్రభుత్వ ఆసుపత్రులలో వసతుల కల్పన...
నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఆసుపత్రి ఆవరణలో సీసీ రోడ్లు, సీసీ కెమెరాలు ఆయా ఎమర్జెన్సీ, ఇతర విభాగాల్లో ఆధునీకరణ పనులు పూర్తి చేసి, నూతన బోర్ వెల్ వేయించడం జరిగింది.
పేదల వైద్యానికి భరోసా... వారి ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ.... ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజలకు నమ్మకం కలిగించేలా కలెక్టర్ వైద్యాధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంటారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించినప్పుడే వృత్తిపరంగా సంతృప్తి ఉంటుందని వైద్యులకు సూచిస్తుంటారు. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని కాకుండా నేను వస్తా బిడ్డో సర్కారు దవాఖానకు అనే స్థాయికి తీసుకు రావాలనే సంకల్పంతో వైద్యులు ఉచిత సేవలు అందించినప్పుడే వైద్య పరంగా మనం ముందుండే ఆస్కారం ఉంటుందని ఆమె ప్రభుత్వ ఆసుపత్రులను తనిఖీ చేసిన సమయాల్లో పదేపదే చెబుతుంటారు. మీరు రోగులకు సేవలు అందించండి.. అవసరమైన వసతి సౌకర్యాలు నేను కల్పిస్తాను అంటూ వైద్యులకు భరోసానిస్తూ.. పేదల ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యత అని హామీ ఇస్తూ.. ప్రభుత్వ ఆసుపత్రులలోనే ప్రసవాలు.. ఎంతో ఖరీదైన శస్త్ర చికిత్సలు.. మన ప్రభుత్వ ఆసుపత్రులలోనే చేస్తారని ప్రజలకు వివరిస్తూ పేదలకు ప్రభుత్వ వైద్యాన్ని మరింత చేరువ చేస్తున్నారు కలెక్టర్ సిక్తా పట్నాయక్.
పేదలకు ఆర్థిక సహాయం, మనోధైర్యం కల్పిస్తూ... ఆపదలో ఉన్నవారికి మానవత్వంతో అండగా నిలుస్తూ...
నారాయణపేట జిల్లాకు చెందిన నిరుపేద మహిళా కుటుంబాలకు ప్రభుత్వ పరంగా సహాయం అందిస్తూ..అనారోగ్య, ఆర్థిక కారణాలతో ఇబ్బందులు పడుతున్న వృద్ధ దంపతులకు ఆర్థిక చేయూత నిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలకు గురైన క్షతగాత్రులను, మతిస్థిమితం కోల్పోయిన అభాగ్యులను మానవత్వంతో వారికి అవసరమైన సహాయం అందిస్తూ ఆపదలో ఉన్న వారికి మనోధైర్యం ఇస్తూ అభాగ్యులకు అండగా నిలుస్తున్నారు. .
విధుల్లో నిర్లక్ష్యం... అవినీతి అధికారులపై కఠిన చర్యలు...
విధుల్లో నిర్లక్ష్యం వహించిన, అవినీతి అధికారులపై ఓ వైపు కఠిన చర్యలు తీసుకుంటూనే పరిపాలనాపరమైన సంస్కరణలు తీసుకువస్తూ ప్రభుత్వ సేవలను క్రమశిక్షణతో సకాలంలో ప్రజలకు అందిస్తున్నారు. వివిధ దినపత్రికల్లో రోజు ప్రచురితమయ్యే ప్రతికూల వార్తలపై సంబంధిత అధికారుల నుంచి రిజైన్డర్స్ క్రమం తప్పకుండా తెప్పించి ఆ సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటున్నారు. సమయ పాలన పాటించని అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసి విధుల పట్ల చిత్తశుద్ధితో ఉండాలని ఆదేశిస్తున్నారు.
ప్రభుత్వ భూములకు రక్షణ...సహజ వనరుల సంరక్షణ...
ప్రభుత్వ భూములను ఆక్రమించిన వందలాది ఎకరాలను ఆక్రమణదారుల నుండి స్వాధీనం చేసుకొని, ప్రభుత్వ భూములకు రక్షణగా నిలిచారు. ఇసుక, మట్టి అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపారు. ప్రభుత్వ పథకాలు, ఇతర అవసరాలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అక్రమ లే ఔట్లకు అడ్డుకట్ట వేశారు. జిల్లాలోని మున్సిపాలిటీ లలో వివిధ వాణిజ్య సముదాయాలకు కాలం చెల్లిన ట్రేడ్ లైసెన్సులు జరిమానాలు విధించి తిరిగి జారీ చేయిస్తున్నారు.
రాష్ట్రంలోనే తొలి మహిళా పెట్రోల్ పంపు...సీఎం చేతుల మీదుగానే ప్రారంభం రాష్ట్రంలోనే తొలి మహిళ పెట్రోల్ బంకును ఏర్పాటు చేయించి, స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభింపజేసి, అప్పటిదాకా ఏదో చిట్టచివరగా ఏర్పడిన జిల్లా నారాయణపేట పేరును 32 జిల్లాలతో దీటుగా నిలిపారని చెప్పడం అతిశయోక్తి కాదు. జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ పంపును ఏర్పాటు చేయించి మహిళలే పంపు ను నిర్వహించే బాధ్యతలు అప్పగించి 16 మందికి ఉపాధి కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. విజయవంతంగా కొనసాగేలా పకడ్బందీగా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి నెలా పెట్రోల్ పంపు నుంచి రూ.3 నుంచి 4 కోట్ల ఆదాయం సమకూరుతుంది. అర్హులైన దివ్యాంగులకు ఎప్పటి కప్పుడు ఉపకరణాలు తక్షణమే పంపిణీ చేయిస్తున్నారు.
ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి... పరిష్కారానికి ఆదేశిస్తూ.....
ప్రతీ సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ప్రజావాణి నిర్వహణతో పాటు, ప్రతి దినము కార్యాలయ పని దినాల్లో వివిధ సమస్యలపై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి, వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తు మరికొన్ని తక్షణమే స్వయంగా పరిష్కరిస్తున్నారు. కేవలం ప్రజావాణి సోమవారమే కాకుండా మామూలు పని దినాలలోనూ సమస్యల పరిష్కారం కోసం వచ్చే ఎంతోమంది ప్రజలను కలసి వారి వినతులు స్వీకరించి సమస్యల పరిష్కారానికి భరోసా కల్పిస్తున్నారు.
ప్రజా ప్రభుత్వం కార్యక్రమాలను విజయవంతoగా నిర్వహిస్తూ...
ప్రజాపాలన - ప్రజా విజయోత్సవాల ఘనంగా చేపట్టారు. భూ భారతి, నూతన ఆర్.ఓ.ఆర్ చట్టంపై మద్దూరు పైలట్ మండలంతో పాటు అన్ని మండలాలలో విజయవంతంగా అవగాహన సదస్సుల నిర్వహింపజేశారు.కొత్తగా నిర్మించిన మెడికల్ కాలేజీ లో మొదటి సంవత్సరం బ్యాచ్ తరగతులను విజయవంతంగా కొనసాగింపజేస్తూ.. రెండో సంవత్సరం తరగతుల నిర్వహణకు ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా మెడికల్ కళాశాల పక్కనే ఎం సి హెచ్ సెంటర్ నిర్మాణ పనులను తొందరగా ప్రారంభించేందుకు అధికారులను సమాయత్తం చేస్తున్నారు. జిల్లాలోని ప్రధాన మున్సిపాలిటీ కేంద్రాలలో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా క్యాంటీన్లు ప్రారంభం.. విజయవంతంగా నిర్వహణ..సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జిల్లాలో సమర్థవంతంగా నిర్వహించారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నారాయణ పేట, మక్తల్ నియోజకవర్గ కేంద్రాలలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి కొత్తగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.
ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు జిల్లా నుంచే.. పునాది పడింది ఇక్కడి నుంచే....
ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీ ల్లో భాగంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డు ల జారీ పథకాలను తాను ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం (నారాయణపేట జిల్లా) కోస్గి మండలం చంద్రవంచ గ్రామంలో జనవరి 26న ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. మండలానికి ఒక గ్రామం చొప్పున ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరీ పత్రాలను అదే రోజు సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. నెల రోజులు పూర్తి కాకుండానే ఫిబ్రవరి 21న మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నారాయణపేట మండలం అప్పక్ పల్లి గ్రామంలో ఓ లబ్ధిదారురాలి ఇందిరమ్మ ఇంటికి భూమిపూజ కూడా చేయించడంలో జిల్లా కలెక్టర్ సఫలీకృతురాలు అయ్యారు అనడంలో సందేహమే లేదు.
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను రికార్డు స్థాయిలో పారదర్శకంగా అర్హులైన లబ్దిదారులకు మాత్రమే పంపిణీ చేసి, నిర్మాణాలు త్వరగా చేపట్టేందుకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. పైరవీలు, అవినీతికి ఆస్కారం లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. పేదవారు తమ సొంత ఇంటి కల నెరవేరుస్తున్న కలెక్టర్ కు లభ్దిదారులు ఇటీవల కలెక్టరేట్ కు వచ్చి కృతజ్ఞతలు తెలియజేశారు.
ముందస్తు ప్రణాళికతో... ఇబ్బందులు దూరం....
జిల్లాలో వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రణాళికతో ముందస్తు చర్యలు చేయించారు. ఎక్కడా ఇబ్బందులు రాకుండా అధికార యంత్రాంగంతో పనులు చేపట్టారు. సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా మున్సిపల్, పంచాయతీరాజ్ అధికారులతో నిత్యం పనులు చేయిస్తూ.. ఆకస్మిక తనిఖీలో పరిశీలిస్తున్నారు.
మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశ్యంతో....
ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశ్యంతో జిల్లాలోని పలు స్వశక్తి సంఘాలకు ఎరువులు, పురుగు మందులు, విత్తనాల విక్రయ కేంద్రాల మంజూరు పత్రాల పంపిణీ చేశారు. జిల్లాలోని మహిళా సంఘాలకు ధాన్యం కొనుగోలు కేంద్రాల కేటాయింపు, విజయవంతంగా కొనుగోళ్లు పూర్తి చేసేలా ప్రణాళిక అమలు చేశారు. కొన్ని కోట్ల రూపాయల కమీషన్ వారికి దక్కనుంది. పలువురుకి క్యాంటీన్లు, ఇతర ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేయించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా రైతులకు విత్తనాలు అందజేశారు. ఎస్.హెచ్.జి. సభ్యులకు పెట్రోల్ బంకులు, రైస్ మిల్లుల నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. మహిళలకు సోలార్ పవర్ పాయింట్లను ఏర్పాటు చేసేందుకు జిల్లాలోని ప్రభుత్వ భూముల వివరాలను సేకరించారు.
మంత్రుల నుంచి ప్రశంసలు అందుకుంటూ...
రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన ప్రతీ ఒక్కరికీ అందేలా ఉమ్మడి జిల్లా ఇన్ చార్జి మంత్రి దామోదర్ రాజానర్సింహ, మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి శాసనసభ్యులు పర్నికా రెడ్డి గార్లతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ వారి ప్రశంసలు అందుకుంటూ నారాయణపేట జిల్లా ప్రజలకు సుపరిపాలన అందిసున్నారు.