సదరం సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలి
- జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్.
గద్వాల, లోకల్ గైడ్ :
జిల్లాలో సదరం సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో చేపట్టిన సదరం సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ, స్లాట్ బుకింగ్ విధానం, పెండింగ్ దరఖాస్తుల వివరాలను సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రభుత్వ ఆసుపత్రిలో విభాగాల వారీగా చేపట్టిన పనులపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎంతమంది స్లాట్లు బుక్ చేస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న వారి దరఖాస్తులను ఎంత మేరకు క్లియర్ చేస్తున్నారని అడిగే వివరాలు తెలుసుకున్నారు. మౌలిక వసతులు, మానవవనరుల అంశాలను వివరణాత్మకంగా అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు సమర్థవంతంగా సేవలు అందించాలనే దృక్పథంతో సదరం స్లాట్ల సంఖ్యను మరింత పెంచాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఆర్థోపెడిక్ విభాగంలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పూర్తి చేయాలని అన్నారు. అల్పదృష్టి, వినికిడి లోపం తదితర దరఖాస్తులను క్లియర్ చేయాలని అన్నారు. వచ్చిన దరఖాస్తుల వివరాలను డిజిటల్గా నమోదు చేయాలని సూచించారు. వచ్చే నెలలో మెగా క్యాంప్ నిర్వహించి పెండింగ్ దరకాస్తులను పూర్తిగా క్లియర్ చేయాలన్నారు. ఆయా దరఖాస్తుల క్లియరెన్స్ ప్రక్రియలో సంబంధిత శాఖల మధ్య సమన్వయం అవసరమని, ప్రణాళి కాబద్ధంగా ముందుకు సాగాలని అన్నారు. ప్రభుత్వాసుపత్రిలో సి.టీ స్కాన్ సేవలు త్వరగా ప్రారంభించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ రావు, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఇందిరా, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ నాగేశ్వర్, వైద్య సిబ్బంది, ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.