దంగల్ కు పాక్ షరతులు.....
పహల్గాం దాడి తర్వాత బాలీవుడ్ వర్గాలు ఎక్కువగా స్పందించకపోవడంపై సోషల్ మీడియాలో తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక చానెల్ షోలో ఆమిర్ ఖాన్ స్పందించారు.ఆమిర్ మాట్లాడుతూ, ‘‘భారతీయ సినిమాల్లో తొలిసారి పాకిస్థాన్ను ప్రత్యక్షంగా శత్రుదేశంగా చూపించింది నా సినిమా సర్ఫరోష్నే. 1999లో వచ్చిన ఆ చిత్రంలో ‘పడోషీ ముల్క్’ (పక్క దేశం) అంటూ పాకిస్థాన్ను ప్రస్తావించాం. దేశానికి మద్దతుగా నిలబడటానికి నష్టం వచ్చినా పర్వాలేదు అనుకున్నాను. అందుకే దంగల్ సినిమాను పాకిస్థాన్లో విడుదల చేయలేదు’’ అని తెలిపారు.
తాము ఏ మతానికి వ్యతిరేకం కాదని, అన్ని మతాలను గౌరవిస్తామని ఆమిర్ స్పష్టం చేశారు. ‘‘అలాంటి డబ్బులు నాకు అవసరం లేదు’’ అని తేల్చి చెప్పారు.
‘‘సర్ఫరోష్ తర్వాత పాకిస్థాన్ పేరు మీద ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే నేను కచ్చితంగా వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడను అనుకుంటారు కొంత మంది. కానీ ఆ సినిమా తర్వాత పాకిస్థాన్ నుంచి ఎన్నో నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. దంగల్ నిర్మాణంలో డిస్నీకి భాగస్వామ్యం ఉంది. వాళ్లు పాకిస్థాన్లో సినిమా రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ అక్కడి సెన్సార్ బోర్డు చివరి సన్నివేశాన్ని తొలగించాలని చెప్పింది. ముఖ్యంగా గీతా ఫోగాట్ గెలిచే మ్యాచ్లో జాతీయ జెండా కనిపించకూడదు, జాతీయ గీతం వినిపించకూడదు అని షరతులు పెట్టారు. అది విన్న వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ‘అయితే ఆ దేశంలో సినిమా రిలీజ్ చేయడం లేదు’ అని చెప్పేశా. డిస్నీ వాళ్లు ‘నష్టం వస్తుంది’ అన్నారు. కానీ జాతీయ గీతం, జెండా తీసేసి చేసే బిజినెస్ నాకు వద్దు’’* అని ఆమిర్ చెప్పారు.
‘‘దంగల్ భారతదేశంలోనే రికార్డు కలెక్షన్లు సాధించింది. అలాగే సీక్రెట్ సూపర్స్టార్కి చైనాలో మంచి ఆదరణ లభించింది. ఆ సమయానికి చైనాతో మనకు ఎలాంటి సమస్యలు లేవు, స్నేహపూర్వక వాతావరణమే’’ అని వివరించారు.
కార్గిల్ యుద్ధం తర్వాత ఎనిమిది రోజుల పాటు లేహ్ సహా పలు ప్రాంతాల్లో పర్యటించినట్లు ఆమిర్ గుర్తు చేసుకున్నారు. జవాన్లను ప్రోత్సహించేందుకు పలు ఆర్మీ రెజిమెంట్లకు వెళ్లి, వాళ్లతో భోజనం చేసి, యుద్ధ సమయంలో ఎదుర్కొన్న పరిస్థితులు అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. దాదాపు ఏడు లేదా ఎనిమిది రాత్రులు అక్కడే గడిపినట్లు చెప్పారు.
ప్రస్తుతం ఆమిర్ కీలక పాత్రలో నటించిన సితారే జమీన్ పర్ ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.