- District News
- ఐటీడీఏ ప్రాంగణంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ఐటీడీఏ ప్రాంగణంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
గిరిజనుల సర్వతోముఖాభివృద్ధికి ఐటీడీఏ అహర్నిశలు కృషి : పీవో బీ రాహుల్
భద్రాచలం : లోకల్ గైడ్ న్యూస్ :
భద్రాచలం ఐటీడీఏ కార్యాలయ ప్రాంగణంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ పోలీస్ గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పీవో బి. రాహుల్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ తదితర మహనీయుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం లభించిందన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ వంటి త్యాగధనుల స్ఫూర్తితో గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. గిరిజన విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రత్యేక విద్యా క్యాలెండర్లు, కెరీర్ గైడెన్స్, టీఎల్ఎం ప్రదర్శనలు, ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమాలు
చేపట్టినట్లు తెలిపారు. గిరిజన విద్యార్థులు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడంతో పాటు ఐఐటీ, ఎన్ఐటీ ప్రవేశాల్లో ప్రతిభ కనబరచడం గర్వకారణమన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్య సేవలను మెరుగుపరచి, మారుమూల ప్రాంతాల్లో వైద్య శిబిరాలు, మొబైల్ మెడికల్ టీమ్స్, బైక్ అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. గిరిజన మహిళల స్వయం ఉపాధి కోసం భద్రగిరి మార్ట్ ద్వారా వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. ఐటీడీఏ పరిధిలో నైపుణ్యాభివృద్ధి, వ్యవసాయం, మత్స్య, ఉద్యాన, ఇంజనీరింగ్, విద్యుత్, గిరిజన సంక్షేమ రంగాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. ఐటీడీఏ ప్రాంగణంలోని గిరిజన మ్యూజియాన్ని ఇప్పటివరకు సుమారు 2.50 లక్షల మంది సందర్శించారని, మ్యూజియానికి రాష్ట్ర స్థాయి ఉత్తమ పురస్కారం లభించిందని తెలిపారు. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, కోయ భాష పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, కొండరెడ్ల కుటుంబాల సమగ్ర సర్వే నిర్వహించినట్లు చెప్పారు. అటవీ హక్కుల పరిరక్షణతో పాటు పర్యావరణ సంరక్షణ, పోడు భూముల్లో పండ్ల తోటల పెంపకానికి ప్రోత్సాహం అందిస్తున్నామని తెలిపారు.
దేశవ్యాప్తంగా గిరిజన సంక్షేమ పథకాల అమలులో ఉత్తమ ఐటీడీఏగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం భద్రాచలం ఐటీడీఏకు గర్వకారణమని పీవో రాహుల్ పేర్కొన్నారు. గిరిజనుల సర్వతోముఖాభివృద్ధికి ఐటీడీఏ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.
