సిద్దిపేట, ఆగస్టు 28(లోకల్ గైడ్):
జిల్లాలో నిర్మాణంలో ఉన్న రెండు పడకల గదుల ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసి, అర్హులైన లబ్ధిదారులకు అందించాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి అధికారులను ఆదేశించారు.శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణ ప్రక్రియపై గృహనిర్మాణ, ఇంజనీరింగ్ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా నిర్మాణంలో ఉన్న ఇళ్ల పురోగతిని సమీక్షించిన ఆమె.. కాంట్రాక్టర్లతో చర్చించి పెండింగ్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులను సైతం సకాలంలో చెల్లించాలని సూచించారు.నిర్మాణాలు పూర్తైన గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి నిబంధనల ప్రకారం అసలైన లబ్ధిదారులను ఎంపిక చేసి, ఇళ్లను ప్రారంభానికి సిద్ధం చేయాలని కలెక్టర్ తెలిపారు. లబ్ధిదారులకు అందించే ఇళ్లకు విద్యుత్, తాగునీరు, సీసీ రోడ్లు, సెప్టిక్ ట్యాంకులు తదితర మౌలిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేసేందుకు గృహనిర్మాణ శాఖ, సంబంధిత ఇంజనీరింగ్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.ఈ సమావేశంలో గృహ నిర్మాణ శాఖ పీడీ భగవంత్ రావు, పంచాయతీ రాజ్ ఈఈ శ్రీనివాస్, ఈడబ్ల్యూఐడీసీ ఈఈ శ్రీనివాస్ రెడ్డి, ఆర్అండ్బీ డీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.