సిద్దిపేట, సెప్టెంబర్ 5(లోకల్ గైడ్):
విద్యార్థులు మంచి విద్యను అభ్యసించడంతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యతలను అలవర్చుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె. సౌజన్య సూచించారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఎన్సాన్పల్లి గ్రామంలోని తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (TSREIS) పాఠశాలలో న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ జి. సుదర్శన్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి కె. సౌజన్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడిన ఆమె ఉపాధ్యాయ దినోత్సవ ప్రాధాన్యతను వివరించారు.విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని ఆమె పేర్కొన్నారు. విద్యార్థులకు విద్యాబోధన చేయడంతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యతలను అలవర్చడంలో ఉపాధ్యాయులు మార్గదర్శకులుగా నిలుస్తారని తెలిపారు.ప్రతి విద్యార్థి చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, తమ హక్కులు, బాధ్యతలను తెలుసుకోవడం ఎంతో ముఖ్యమని కె. సౌజన్య అన్నారు. చట్టాలపై అవగాహన కలిగి ఉండటం ద్వారా విద్యార్థులు తమను తాము రక్షించుకోవడంతో పాటు సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగగలరని సూచించారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ ఎం. రవి కుమార్, పాఠశాల ప్రిన్సిపాల్ కే. విష్ణువర్ధన్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.