- District News
- Khammam
- మధిరలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం
మధిరలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం
ముఖం, చేతులపై రక్తపు మరకలు.. మృతిపై అనుమానాలు
మధిర ఆగస్టు 11 : లోకల్ గైడ్:
మధిర–వైరా ప్రధాన రహదారిపై పీవీఆర్ కళ్యాణ మండపం సమీపంలో మంగళవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. రహదారి పక్కన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులకు మృతుడి ముఖం, చేతులపై రక్తపు మరకలు కనిపించడంతో ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ప్రమాదమా? లేక మరేదైనా కారణంతో మృతి సంభవించిందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెలికితీసేందుకు ఖమ్మం నుంచి క్లూస్ టీమ్ను రప్పించిన పోలీసులు, సంఘటనా స్థలంలో ఆధారాలను సేకరించారు. రూరల్ సీఐ మధు, టౌన్ సీఐ రమేష్, ఎస్ఐ నవిత సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతుడి ఆచూకీ, గుర్తింపుపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.మృతుడి గుర్తింపు, మృతికి గల అసలు కారణం పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
