- District News
- Khammam
- ప్రతి బాలబాలికకు భద్రమైన బాల్యాన్ని అందించడం మనందరి బాధ్యత... జిల్లా న్యాయసేవా సంస్థ చైర్మన్, జిల్లా...
ప్రతి బాలబాలికకు భద్రమైన బాల్యాన్ని అందించడం మనందరి బాధ్యత... జిల్లా న్యాయసేవా సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి నాగరాజు
విద్యార్థుల్లో చట్టపరమైన అవగాహన పెంపొందించడం అత్యంత ఆవశ్యకం గుడ్ టచ్.. బ్యాడ్ టచ్ పై పాఠశాలల్లో విస్తృత అవగాహన కల్పించాలి

ప్రతి చిన్నారికి సురక్షితమైన, భద్రమైన బాల్యాన్ని అందించడం సమాజంలోని ప్రతి ఒక్కరి ప్రాథమిక బాధ్యత అని జిల్లా న్యాయసేవా సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం. నాగరాజు పిలుపునిచ్చారు. శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సమావేశ మందిరంలో జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పిల్లలకు అనుకూలమైన న్యాయ సేవల పథకం-2024 క్రింద బాలల సంరక్షణ అధికారుల కోసం ఏర్పాటు చేసిన ఒక రోజు ప్రత్యేక అవగాహన సదస్సును జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ, తల్లి కోడి తన రెక్కల కింద పిల్లలను పెట్టుకుని ప్రమాదాల నుండి ఎలా ఆప్యాయంగా కాపాడుకుంటుందో, సమాజంలో ఉపాధ్యాయులు కూడా విద్యార్థులను అదే రీతిలో ప్రేమతో, బాధ్యతతో సంరక్షించాలని అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులకు చిన్ననాటి నుంచే చట్టాలపై, తమ ప్రాథమిక హక్కులపై స్పష్టమైన అవగాహన కల్పించాలన్నారు. పాఠశాలల్లో చిన్న పిల్లలకు 'గుడ్ టచ్.. బ్యాడ్ టచ్' గురించి సరైన రీతిలో అర్థమయ్యేలా విడమరిచి చెప్పాలన్నారు. అనవసరపు స్పర్శను గుర్తించి, వెంటనే తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు తెలిపేలా వారిలో ధైర్యాన్ని నింపాలన్నారు.
విద్యార్థుల ప్రవర్తనలో ఏవైనా అసాధారణ మార్పులు (భయం, ఒంటరితనం, ఆందోళన) కనిపిస్తే టీచర్లు వెంటనే గమనించాలన్నారు. పిల్లలతో స్నేహపూర్వకంగా ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించే మార్గదర్శకులుగా నిలవాలన్నారు.
బాలల సంరక్షణ అధికారులు తమ విధులను కేవలం ఒక ఉద్యోగంగా కాకుండా, సామాజిక బాధ్యతగా భావించి సమర్థవంతంగా పనిచేయాలన్నారు. బాల్య వివాహాలు, బాలకార్మిక వ్యవస్థ, పిల్లలపై జరుగుతున్న వేధింపులపై తక్షణమే స్పందించి బాధితులకు అండగా నిలవాలన్నారు.
"మొక్కై వంగనిది.. మానై వంగునా.." అనే సామెతను గుర్తు చేస్తూ, బాల్యం నుంచే పిల్లలకు మంచి నడవడిక, బుద్ధులు, నైతిక విలువలు నేర్పించడం చాలా అవసరమని తెలిపారు. బాల్యాన్ని సరైన మార్గంలో తీర్చిదిద్దితేనే వారి భవిష్యత్తు, సమాజ భవిష్యత్తు బాగుంటుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అన్నారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ మాట్లాడుతూ, నేటి డిజిటల్ యుగంలో సమాజం చాలా వేగంగా మారుతోందని, దీనివల్ల బాలలు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లు కూడా కొత్త రూపు సంతరించుకుంటున్నాయని అన్నారు. అధికారులందరూ చట్ట పరిధిని, తాజా నిబంధనలను క్షుణ్ణంగా అర్థం చేసుకుని, సమర్థవంతంగా విధులు నిర్వహించాలని తెలిపారు. చట్టాల అమలు క్షేత్రస్థాయిలో మాత్రమే స్పష్టమైన ఫలితాలను ఇస్తుందని, అందుకే ప్రాథమిక స్థాయిలో పనిచేసే సిబ్బందికి చట్టాలపై నిరంతరం అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉన్నతాధికారులపై ఉందన్నారు. బాలల సంక్షేమం, హక్కుల కాపాడటంలో ఎలాంటి అలసత్వానికీ తావులేదని స్పష్టం చేశారు. ప్రతి బిడ్డకు సురక్షితమైన వాతావరణం కల్పించేలా జువైనల్ జస్టిస్ యాక్ట్, పోక్సో చట్టం వంటి విధానాలను బాధ్యతాయుతంగా అమలు చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు డా. పి.పి. కృష్ణ అర్జున్, డా. జి.వి. మహేష్ నాధ్, వి. శ్రీనయ్య, ఎం. శ్రీనివాస్, ఎం. కల్పన, వి. శివ రంజని, టి. మురళి మోహన్, పి. దేవి మానస, షేక్ మీరా ఖాసీం సాహెబ్, కె. జ్యోతిర్మయి, బి. రజని, వై. బిందుప్రియ, ఏ. ప్రవీణ్, బి. నాగలక్ష్మి, జి. అఖిల గౌడ్, వి. దీప్తి, జి. నిష్క, బి. నాగ సుమ బాల, వి. లావణ్య, జిల్లా బాల సంరక్షణ అధికారిణి విష్ణు వందన, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
