- District News
- Khammam
- నేడు ఉపాధ్యాయుల మానసిక ప్రశాంతతకు ధ్యాన శిక్షణ
నేడు ఉపాధ్యాయుల మానసిక ప్రశాంతతకు ధ్యాన శిక్షణ
విద్యార్థుల్లో ఏకాగ్రత, సానుకూల ఆలోచనలు పెంపొందించడమే లక్ష్యం
కారేపల్లి (సింగరేణి), సెప్టెంబర్ 2, లోకల్ గైడ్ న్యూస్ : ఉపాధ్యాయుల మానసిక ప్రశాంతత, ఏకాగ్రతతో పాటు విద్యార్థుల్లో సానుకూల ఆలోచనా విధానాన్ని పెంపొందించే లక్ష్యంతో కారేపల్లి మండలంలో ప్రత్యేక ధ్యాన శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గురువారం నుంచి కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు ఈ శిక్షణ నిర్వహించనున్నట్లు ఎంఈఓ దుగ్గిరాల జయరాజు, కారేపల్లి పిరమిడ్ సేవాదళ్ అధ్యక్షురాలు ముక్కా స్వరాజ్యలక్ష్మి తెలిపారు. బ్రహ్మశ్రీ పితామహ పత్రీజీ స్ఫూర్తితో పిరమిడ్ సేవాదళ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయుల్లో ఒత్తిడిని తగ్గించి, బోధనపై మరింత ఏకాగ్రత సాధించేలా ధ్యాన సాధనను పరిచయం చేయనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఉపాధ్యాయులు ప్రతిరోజూ విద్యార్థుల బోధనతో పాటు వివిధ బాధ్యతలు నిర్వహిస్తున్న నేపథ్యంలో మానసిక ప్రశాంతతను కాపాడుకోవడం ఎంతో అవసరమని తెలిపారు. ధ్యానం ద్వారా ప్రశాంతత, ఏకాగ్రత, క్రమశిక్షణ, సానుకూల దృక్పథం పెంపొందించుకోవచ్చని వివరించారు. అదేవిధంగా పాఠశాలల్లో విద్యార్థులకు ధ్యానాన్ని ఎలా పరిచయం చేయాలి, పిల్లలకు సులభంగా అర్థమయ్యే విధంగా ధ్యాన పద్ధతులను ఎలా బోధించాలి, వారి ఏకాగ్రత మరియు ప్రశాంతత పెరిగేలా ధ్యానాన్ని నిత్య జీవితంలో ఎలా అలవాటు చేయాలి అనే అంశాలపై ఉపాధ్యాయులకు ప్రాయోగిక అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి పిరమిడ్ సేవాదళ్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి, పీఎంసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆనంద్ బుద్ధ, భూపతిరాజు హనుమంతరావు, రమేష్ తదితరులు హాజరై ధ్యానం యొక్క ప్రాధాన్యత, సాధన విధానం, విద్యార్థులకు బోధించే పద్ధతులపై మార్గదర్శనం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కారేపల్లి మండల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని శిక్షణలో పాల్గొనాలని వారు కోరారు.
