- District News
- ప్రభుత్వ భూముల కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి
ప్రభుత్వ భూముల కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి
తహసీల్దార్కు, గ్రామపంచాయతీ సర్పంచ్ కి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ బృందం వినతిపత్రం
చర్ల : లోకల్ గైడ్ న్యూస్ :
చర్ల మండల కేంద్రంలోని గ్రామ కంఠం ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై రెవెన్యూ, గ్రామపంచాయతీ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం చర్ల మండల కేంద్రంలోని తహసీల్దార్కు, గ్రామపంచాయతీ సర్పంచ్కు తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ బృందం వినతిపత్రం అందజేసింది. చర్ల గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 117లో సుమారు 378 ఎకరాల భూమి అన్యాక్రాంతానికి గురవుతోందని తుడుందెబ్బ నాయకులు పేర్కొన్నారు. విలువైన గ్రామ కంఠం ప్రభుత్వ భూములు వలస వచ్చిన గిరిజనేతరుల కబ్జాలో ఉన్నాయని ఆరోపించారు. ప్రభుత్వ భూములను గుర్తించి, తహసీల్దార్, గ్రామపంచాయతీ అధికారులు సంయుక్తంగా ప్రభుత్వ భూములుగా సూచించే బోర్డులను ఏర్పాటు చేయాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అమలులో ఉన్న ఎల్టీఆర్, 1/70, 1996 పేసా చట్టాలు పూర్తిస్థాయిలో అమలు చేయడంలో అధికారులు విఫలమవుతున్నారని వారు ఆరోపించారు. ఆదివాసీ పోరాట వీరులు సాధించిన హక్కులు, చట్టాల ఫలాలు స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా ఆదివాసీలకు అందని ద్రాక్షగానే మిగిలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు అధికారులు తక్షణమే చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఆదివాసీ హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ హెచ్చరించింది. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ పొలిట్బ్యూరో సభ్యులు వాసం ముసలయ్య, విద్యార్థి జేఏసీ రాష్ట్ర నాయకులు ఇర్ప ప్రకాష్ దొర, తుడుందెబ్బ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పూనెం వరప్రసాద్, మండల కమిటీ సభ్యులు యాక సురేంద్ర, మడప అనిల్, సారెం హరిదీప్, సోడి సందీప్ తదితరులు పాల్గొన్నారు.
