సిద్దిపేట, ఆగస్టు 21(లోకల్ గైడ్):
నీటిపారుదల ప్రాజెక్టుల పరిధిలో పెండింగ్లో ఉన్న భూసేకరణ, పరిహారం చెల్లింపు, పునరావాస పనులను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి నీటిపారుదల ప్రాజెక్టులపై సమీక్షించారు.నీటిపారుదల ప్రాజెక్టుల పనులు సకాలంలో పూర్తయ్యేందుకు పెండింగ్ భూసేకరణను పూర్తి చేయాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు. పెండింగ్ భూసేకరణ కోసం రూ.2,800 కోట్ల నిధులను విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారని పేర్కొన్నారు.కొత్త ఆయకట్టు సృష్టించేందుకు వీలుగా పెండింగ్ భూసేకరణ, పునరావాస పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. అవసరమైన నిధులు అందుబాటులో ఉన్నందున ఎక్కడా జాప్యం లేకుండా ప్రక్రియను పూర్తి చేసి ప్రాజెక్టుల పనులకు ఆటంకాలు లేకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు.వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ కె. హైమావతి మాట్లాడుతూ జిల్లాలో నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ భూసేకరణ, పరిహారం చెల్లింపు, పునరావాస ప్రక్రియలను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భూసేకరణకు సంబంధించి సమస్యలు ఉంటే క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులతో సమన్వయం చేసుకుంటూ పరిష్కరించాలని సూచించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్లో సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం నుంచి జిల్లా కలెక్టర్ కె. హైమావతి, నీటిపారుదల శాఖ ఎస్ఈ, డీఈ తదితరులు పాల్గొన్నారు.